ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిన్ మరో ఘనత సాధించింది. క్లైమేట్ న్యూట్రల్ నౌ విభాగంలో ఐక్యరాజ్యసమితి అందించే గ్లోబల్ క్లైమేట్ యాక్షన్ అవార్డును సొంతం చేసుకుంది భారత కార్పొరేట్ దిగ్గజం. ఈ అవార్డు పొందిన తొలి భారత కార్పొరేట్ సంస్థగా సరికొత్త రికార్డు సృష్టించింది ఇన్ఫోసిస్.
స్పెయిన్ మాడ్రిడ్లో జరిగిన ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పుల సమావేశంలో ఈ అవార్డు అందుకున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. వాతావరణంలో జరిగే మార్పులను పరిష్కరించేందుకు వినూత్నంగా, ఆచరణాత్మక చర్యలతో ఇన్ఫోసిస్ చేపట్టిన 'కార్బన్ న్యూట్రల్ ప్రోగ్రామ్'కు ఈ అవార్డు దక్కినట్లు వెల్లడించారు. ఈ ప్రోగ్రామ్ ద్వారా వాతావరణ మార్పులతో పాటు లింగ సమానత్వం, ఆరోగ్య శ్రేయస్సు, ఆర్థిక అవకాశాలు తదితర అంశాల్లో స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకు కార్బన్ న్యూట్రల్ ప్రోగ్రామ్.. పలు చర్యలను సూచించిందని తెలిపారు.
కార్బన్ న్యూట్రాలిటీ కోసం ఇన్ఫోసిస్ చేసిన ప్రయత్నం నిజంగా స్ఫూర్తినిచ్చేలా ఉందని ఐరాస గ్లోబల్ క్లైమేట్ యాక్షన్ మేనేజర్ ప్రోగ్రామ్ నిక్లాస్ కొనియాడారు.