ఎల్ఐసీ ఆఫ్ ఇండియా ప్రధాన వాటాదారుగా ఉన్న ఐడీబీఐ బ్యాంకు గత కొన్ని త్రైమాసికాలుగా వరుసగా లాభాలు ప్రకటిస్తోంది. చాలా వరకూ కష్టాలు తొలగిపోయి, వృద్ధి బాటలో ముందుకు సాగుతున్నామని, దీనికి గత కొంతకాలంగా తీసుకున్న దిద్దుబాటు చర్యలే కారణమని ఐడీబీఐ బ్యాంకు డిప్యూటీ ఎండీ సురేష్ ఖతాన్హర్ ‘ఈనాడు’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ప్రధానంగా రిటైల్ బ్యాంకింగ్ సేవలకు పెద్దపీట వేసినట్లు, ఐడీబీఐ బ్యాంకును రిటైల్ బ్యాంకింగ్ సేవల సంస్థగా ముందుకు తీసుకువెళ్లాలనేది తమ ప్రధానోద్దేశమని ఆయన స్పష్టం చేశారు. డిజిటల్ సేవలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు, తద్వారా వినియోగదార్లకు మెరుగైన సేవలు అందించే అవకాశం వస్తోందని తెలిపారు. సైబర్ మోసాలను బ్యాంకింగ్ రంగానికి పెను సవాలుగా పేర్కొంటూ, దీన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రయత్నించాల్సిన అవసరం ఉందన్నారు. బ్యాంకింగ్ సంస్థలకు లాభదాయకత తక్కువగా ఉందని, అందువల్ల లాభదాకతను పెంపొందించుకునే మార్గాలపై కసరత్తు చేయాలని సూచించారు. ఇంటర్వ్యూ విశేషాలు..
ఐడీబీఐ బ్యాంకు గత 8 త్రైమాసికాలుగా లాభాలు నమోదు చేస్తోంది. అంటే బ్యాంకుకు కష్టాలు తీరిపోయినట్లేనా ?
సేవలను మెరుగుపరచటంతో పాటు అంతర్గతంగా పని విధానాలను సమర్థంగా తీర్చిదిద్దాం. బ్యాంకు వృద్ధి బాటలో నడవటానికి అవసరమైన పరిస్థితులను కల్పించాం. నైపుణ్యం, అనుభవం ఉన్న వారితో డైరెక్టర్ల బోర్డు ఏర్పాటైంది. వరుసగా 8 త్రైమాసికాలుగా లాభాలు ఆర్జించటానికీ అదే కారణం. ఈ వృద్ధి బాటలో ముందుకు సాగగలమనే విశ్వాసం ఉంది.
ఎటువంటి చర్యలతో ఈ మార్పు సాధ్యమైంది ?
రిటైల్ బ్యాంకు మాదిరిగా ఐడీబీఐ బ్యాంకును మార్చుతున్నాం. తక్కువ మూలధనం అవసరమైన వ్యాపార విధానం వైపు మొగ్గుచూపుతున్నాం. దీనికి తోడు అధిక వడ్డీరేటు చెల్లించాల్సిన డిపాజిట్లను తగ్గించుకొని, కాసా (కరెంటు, సేవింగ్ ఖాతాలు) డిపాజిట్లు పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ఆటోమేషన్/ డిజిటైజేషన్కు ప్రాధాన్యం ఇస్తున్నందున నిర్వహణ వ్యయాలు తగ్గుముఖం పడుతున్నాయి. బ్రాంచి కార్యకలాపాలను కేంద్రీకరిస్తూ, విక్రయాలు- క్రెడిట్ ప్రాసెసింగ్ కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశాం. తద్వారా తక్కువ సమయంలో మార్పు సాధ్యమైంది.
ప్రస్తుతం బ్యాంకు ప్రాధాన్యతలు ఎలా ఉన్నాయి ?
దాదాపు 60% వరకూ రిటైల్ బ్యాంకింగ్, 40% కార్పొరేట్ రుణాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. రిటైల్లో బంగారం, వాహన రుణాలు, వ్యక్తిగత రుణాలు, ఎస్ఎంఈ అప్పులు అధికంగా ఇవ్వాలనేది ఆలోచన. వినియోగదార్లకు మరింతగా దగ్గరయ్యేందుకు వీలుగా ఫిన్టెక్ ప్లాట్ఫామ్స్, కో-లెండింగ్, బ్యాంకింగ్ కరెస్పాండెంట్స్/ బ్యాంకింగ్ ఫెసిలిటేటర్స్తో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాం. కరెంటు, సేవింగ్స్ ఖాతాలకు ప్రాధాన్యం, డిజిటల్ సేవలు విస్తరించటంపై దృష్టి సారిస్తున్నాం.
సమీప భవిష్యత్తులో ఏమేరకు అభివృద్ధి సాధించగలరు ?
లోపాలు సరిదిద్దుకొని బలోపేతమయ్యే క్రమంలో ఐడీబీఐ బ్యాంకు ఉంది. ఎంతో ఆసక్తికరమైన భవిష్యత్తు మాకు కనిపిస్తోంది. ఇటీవల పీసీఏ ఫ్రేమ్వర్క్ (ప్రామ్ట్ కరెక్టివ్ యాక్షన్) నుంచి బయటకు వచ్చాం. దీనివల్ల కార్పొరేట్ రుణాలు జారీ చేసేందుకు వీలుకలుగుతోంది. రిటైల్/ కార్పొరేట్ మధ్య సమతౌల్యాన్ని పాటిస్తూ ముందుకు సాగుతాం.
తెలుగు రాష్ట్రాల్లో ఐడీబీఐ బ్యాంకు కార్యకలాపాలు ఎలా సాగుతున్నాయి ?
రెండు రాష్ట్రాల్లో రూ.21,000 కోట్ల వ్యాపారాన్ని నమోదు చేస్తున్నాం. తెలంగాణలో రూ.13,000 కోట్లు, ఆంధ్రప్రదేశ్లో రూ.8,000 కోట్ల వ్యాపారం ఉంది. తెలంగాణలో 42 శాఖలు, 96 ఏటీఎంలు, ఆంధ్రప్రదేశ్లో 56 శాఖలు, 100 ఏటీఎంలు నెలకొల్పాం. రెండు రాష్ట్రాల్లో కొత్త శాఖలు ఏర్పాటు చేసి బహుముఖంగా విస్తరించాలని, వ్యాపారాన్ని పెంచుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం.
దేశీయ బ్యాంకింగ్ రంగానికి అవకాశాలు, సవాళ్లు ఏమిటి ?
బ్యాంకింగ్ రంగం కొన్ని అంశాలపై దృష్టి సారించాలి. డిజిటల్ సేవలను విస్తృత స్థాయిలో అందించాలి. సైబర్ మోసాలను అరికట్టాలి. లాభదాయకతను పెంచుకోవాలి. ‘హైబ్రీడ్/ రిమోట్ వర్క్’ విధానం, ప్రాసెస్ ఆటోమేషన్, ఉత్పాదకతలకు ప్రాధాన్యం ఇవ్వాలి. దీనికి అవసరమైన పెట్టుబడులు పెట్టాలి. రుణాల్లో వృద్ధి ఆశించినంతగా లేదు. ఈ సవాలును ఎలా ఎదుర్కొనాలనేది ప్రశ్న. అదేవిధంగా నిధుల వ్యయాన్నీ తగ్గించుకోవాలి. దీనికోసం ఈక్విటీ రూపంలో, మరేదైనా రూపంలో మూలధన నిధులు సమకూర్చుకోవాలి.