దేశవ్యాప్తంగా సెప్టెంబర్లో వాహనాల రిటైల్ విక్రయాలు గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే 5 శాతానికిపైగా తగ్గాయని ఆటోమొబైల్ డీలర్ల సమాఖ్య 'ఫాడా' ప్రకటించింది. ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్ల విక్రయాల్లో భారీ క్షీణతే ఇందుకు కారణంగా తెలిపింది. కార్లు, వాణిజ్య వాహనాలు, త్రీ వీలర్స్ విక్రయాలు మాత్రం పెరిగినట్లు వెల్లడించింది ఫాడా.
ఫాడా నివేదికలో మరిన్ని విశేషాలు..
- గత నెలలో మొత్తం 12,96,257 వాహనాలు విక్రయమయ్యాయి. 2020 సెప్టెంబర్లో ఈ సంఖ్య 13,68,307గా ఉంది.
- 2020 సెప్టెంబర్లో 10,33,895 ద్విచక్రవాహనాలు అమ్ముడయ్యాయి. గత నెల వీటి రిటైల్ విక్రయాలు 11.54 శాతం క్షీణతతో 9,14,621 యూనిట్లకు పడిపోయాయి.
- ట్రాక్టర్ల రిటైల్ విక్రయాలు ఈ ఏడాది సెప్టెంబర్లో ఏకంగా 23.85 శాతం పడిపోయాయి. గత నెల మొత్తం 52,896 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2020 సెప్టెంబర్లో 69,462 ట్రాక్టర్లు విక్రయమయ్యాయి. కరోనా కాలంలో కూడా ఈ తగ్గని ట్రాక్టర్ల విక్రయాలు గత నెలలో భారీగా క్షీణించడం గమనార్హం.
- కార్ల రిటైల్ విక్రయాలు గత నెల 16.32 శాతం పెరిగి.. 2,33,308 యూనిట్లకు చేరాయి. 2020 సెప్టెంబర్లో ఈ సంఖ్య 2,00,576 యూనిట్లుగా ఉండటం గమనార్హం.
- గత నెలలో వాణిజ్య వాహనాల రిటైల్ విక్రయాలు 46.64 పుంజుకున్నాయి. మొత్తం 36,612 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే సమయంలో 24,262 యూనిట్లు మాత్రమే విక్రయమయ్యాయి.
- ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య 71,85,561 వాహనాల రిటైల్ విక్రయాలు నమోదయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఈ మొత్తం 35 శాతం ఎక్కువ.
ఇదీ చదవండి: ఐబీపీఎస్ క్లర్క్ పోస్టులకు నోటిఫికేషన్- మాతృ భాషలోనే పరీక్ష!