ఈ ఏడాది పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)ల మార్కెట్ కళకళలాడింది. డజనుకుపైగా కంపెనీలు రూ.25,000 కోట్లు సమీకరించి అదరగొట్టాయి. అధిక నగదు లభ్యతకు తోడు మదుపర్లు ఆసక్తి ప్రదర్శించడం కంపెనీలకు కలిసొచ్చిందని, వచ్చే ఏడాది కూడా ఐపీఓ విపణి ఇంతే బలంగా ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది కాలంలో ఫార్మా, టెలికమ్యూనికేషన్, ఐటీ, ఆర్థిక సేవలు వంటి వివిధ రంగాల కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు రావడం గమనార్హం.
- ఈ ఏడాదిలో ఇప్పటి వరకు కంపెనీలు రూ.25000 కోట్ల వరకు సమీకరించగా.. డిసెంబరు 2న మొదలుకానున్న బర్గర్ కింగ్ ఐపీఓతో ఈ మొత్తం ఇంకా పెరిగే అవకాశం ఉంది.
- లాక్డౌన్ తర్వాత ఐపీఓ మార్కెట్ కొంత కాలం స్తబ్దుగా కనిపించింది. మే నుంచి ఆగస్టు మధ్య కాలంలో భారీ రైట్ ఇష్యూలు, క్యూఐపీలు, బ్లాక్ ట్రేడ్లు, ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్లు వచ్చాయి. జులైలో రొస్సారీ బయోటెక్ ఇష్యూ తర్వాత మళ్లీ ఐపీఓల సందడి మొదలైంది.
- ఈ ఏడాది వచ్చిన భారీ ఐపీఓల్లో ఎస్బీఐ కార్డ్స్ (రూ.10,335 కోట్లు), గ్లాండ్ ఫార్మా (రూ.6,480 కోట్లు), క్యామ్స్ (రూ.2,240 కోట్లు), యూటీఐ అసెట్ (రూ.2,160 కోట్లు) ఉన్నాయి.
- రొస్సారీ బయోటెక్, హ్యాపియెస్ట్ మైండ్స్, రూట్ మొబైల్, కెమ్కాన్ స్పెషాలిటీ, ఏంజెల్ బ్రోకింగ్, ఈక్విటాస్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్, లిఖిత ఇన్ఫ్రా, మజగాన్ డాక్ షిప్బిల్డర్స్లు కూడా ఐపీఓకు వచ్చాయి.
- జులైలో మైండ్స్పేస్ బిజినెస్ పార్క్స్ రీట్ రూ.4,500 కోట్లు సమీకరించింది.
- ఈ ఏడాది వచ్చిన ఐపీఓల్లో ఎక్కువ శాతం మదుపర్లకు లాభాలను పంచాయి. రూట్మొబైల్, హ్యాపియెస్ట్ మైండ్స్, రొస్సారీ బయోటెక్, గ్లాండ్ ఫార్మాలు 40- 200 శాతం లాభాన్ని ఇప్పటికే పంచాయి.
స్టాక్ ఎక్స్ఛేంజీల సమాచారం ప్రకారం..
- 2020లో 12 ఐపీఓలు రూ.25,000 కోట్లు
- 2019లో 16 ఐపీఓలు రూ.12,362 కోట్లు
- 2018లో 24 ఐపీఓలు రూ.30,959 కోట్లు సమీకరించాయి.
ఇదీ చూడండి:అమెరికా నుంచి భారత్కు ఎఫ్డీఐల జోరు