కరోనా సంక్షోభ సమయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ... ప్రపంచదేశాలు ప్రకటించిన అతిపెద్ద ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీల్లో ఒకటిగా నిలిచింది.
భారత జీడీపీలో 10 శాతాన్ని 'ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్' కోసం కేటాయిస్తున్నట్లు ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఇది దాదాపు పాకిస్థాన్ వార్షిక జీడీపీకి (284 బిలియన్ డాలర్లకు) సమానం. ఈ విషయంలో భారత్ కంటే ముందు వరుసలో జపాన్, అమెరికా, స్వీడన్, ఆస్ట్రేలియా, జర్మనీ మాత్రమే ఉన్నాయి.
కరోనా ధాటికి విలవిల
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కనీవిని ఎరుగని రీతిలో దెబ్బతీసింది. ఆర్థిక వ్యవస్థలను కుదేలు చేసింది. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కడానికి పలు దేశాలు భారీ ఎత్తున ఉద్దీపన ప్యాకేజీలను ప్రకటించాయి.
దేశం | ప్యాకేజీ | జీడీపీలో ఎంత శాతం |
జపాన్ | 1.1 ట్రిలియన్ డాలర్లు | 21.1 శాతం |
అమెరికా | 2.7 ట్రిలియన్ డాలర్లు | 13 శాతం |
స్వీడన్ | 12 శాతం | |
ఆస్ట్రేలియా | 10.8 శాతం | |
జర్మనీ | 815 బిలియన్ డాలర్లు | 10.7 శాతం |
ఇటలీ | 815 బిలియన్ డాలర్లు | |
భారత్ | 265 బిలియన్ డాలర్లు | 10 శాతం |
బ్రిటన్ | 100 బిలియన్ పౌండ్లు(తక్షణ సాయం) | |
బ్రిటన్ | 330 బిలియన్ పౌండ్లు (రుణ హామీలు) | |
స్పెయిన్ | 7.3 శాతం | |
ఇటలీ | 5.7 శాతం | |
ఫ్రాన్స్ | 9.3 శాతం |
స్వావలంబనే లక్ష్యంగా...
మోదీ ప్రకటించిన ప్యాకేజీ.. ప్రపంచవ్యాప్తంగా ప్రకటించిన చాలా ఉద్దీపన ప్యాకేజీల కంటే భిన్నమైనది. భారత ప్రభుత్వం ఈ ఖర్చు చేయడం లేదు. రిజర్వ్ బ్యాంకు సాయంతో ఈ ప్యాకేజీ నిధులన్నీ దశలవారీగా ఖర్చు చేయనున్నారు.
అదే అమెరికా విషయంలో అయితే ట్రంప్ ప్రభుత్వమే మొత్తం 2.7 ట్రిలియన్ డాలర్లను ఖర్చు చేస్తోంది. దీనితో ఫెడరల్ రిజర్వ్ నిధులను కలపలేదు.
ఆర్బీఐ అండతో...
మార్చిలో భారత ప్రభుత్వం రూ.1.7 లక్షల కోట్లు ప్యాకేజీని ప్రకటించింది. పేదలకు ఉచిత ఆహారం, వృద్ధులకు, మహిళలకు నగదు సహాయం అందించేందుకు ఈ నిధులు కేటాయించింది.
దీనితోపాటు ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య లభ్యత పెంచడానికి రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పలు చర్యలు చేపట్టింది. మార్చిలో రూ.3.7 లక్షల కోట్లు, ఏప్రిల్లో రూ.2 లక్షల కోట్లను లిక్విడిటీ పెంచేందుకు అందించింది. వడ్డీ రేట్లలో కోత విధించింది.
ఇదీ చూడండి: చిన్న పరిశ్రమలకు రూ.3 లక్షల కోట్ల రుణాలు