ఐఫోన్ వినియోగదారులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐఫోన్ 12 వచ్చేసింది. ఐఫోన్ 12, ఐఫోన్ 12 ప్రో, ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 12 మినీని యాపిల్ మంగళవారం విడుదల చేసింది. ఈ నెల 30 నుంచి భారత్లో వీటి విక్రయాలు ప్రారంభం కానున్నాయి. కొత్త మోడల్ విడుదల తర్వాత కీలక ప్రకటన చేసింది యాపిల్ సంస్థ. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఐఫోన్ల ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఐఫోన్ ఎక్స్ఆర్, ఐఫోన్ ఎస్ఈ, ఐఫోన్ 11 ఎంఆర్పీ ధరలను సవరించి.. కొత్త ధరల వివరాలను యాపిల్ ఇండియా తమ ఆన్లైన్ స్టోర్లో ఉంచింది. అయితే, ధర తగ్గించిన నేపథ్యంలో ఐఫోన్లతో పాటు వచ్చే ఛార్జర్, ఇయర్పాడ్స్ను యాపిల్ తొలగించింది. ఇకపై ఐఫోన్ను కొనుగోలు చేస్తే అందులో ఐఫోన్తో పాటు కేవలం ఛార్జింగ్ కోసం కేబుల్ కనెక్టర్ మాత్రమే ఇవ్వనున్నారు. ఐఫోన్ 12ను ఛార్జర్, ఇయర్పాడ్స్ లేకుండా అమ్మనున్నారు. దీంతో మిగతా మోడళ్లను అలాగే విక్రయించాలని సంస్థ నిర్ణయించింది.
ధరలు ఇలా..
ప్రస్తుతం ఐఫోన్ ఎక్స్ఆర్ (64జీబీ) ధర ₹52,500 ఉండగా.. ₹47,900కు విక్రయించనున్నారు. ఐఫోన్ ఎస్ఈ (2020) 64 జీబీ వేరియంట్ ధరను ₹42,500 నుంచి 39,900కి, 128జీబీ వేరియంట్ ₹47,800 నుంచి ₹44,900కి, 256జీబీ వేరియంట్ ₹58,300 నుంచి ₹54,900కి తగ్గించారు.
ఐఫోన్ 11 ధర ₹13 వేలకు పైగా తగ్గడం విశేషం. ప్రస్తుతం ఐఫోన్ 11 ధర ₹68,300 ఉండగా.. ₹54,900కి యాపిల్ తగ్గించింది. దీపావళి పండగ ప్రత్యేకంగా యాపిల్ సంస్థ ఐఫోన్ 11కి ఇయర్పాడ్స్ జత చేసి అక్టోబర్ 17 నుంచి విక్రయించనుంది. అయితే, యాపిల్ ఆన్లైన్ స్టోర్లలో తగ్గించిన ఐఫోన్ల ధరలను అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఆన్లైన్ షాపింగ్ పోర్టళ్లలో తగ్గించకపోవడం గమనార్హం.