భారత్లో నేరాలకు పాల్పడి, బ్రిటన్కు పరారైన ప్రముఖుల బాగోతాలను వివరిస్తూ తాజాగా ఒక పుస్తకం ప్రచురితమైంది. 'ఎస్కేప్డ్ : ట్రూ స్టోరీస్ ఆఫ్ ఇండియన్ ఫ్యుజిటివ్స్ ఇన్ లండన్' పేరిట రూపొందిన ఈ పుస్తకంలో కింగ్ ఫిషర్ మాజీ అధిపతి విజయ్ మాల్య, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, నౌకాదళ మాజీ అధికారి రవి శంకరన్, సంగీతకారుడు నదీమ్ సైఫీ తదితరుల వ్యవహారాలను పొందుపరిచారు. లండన్ కేంద్రంగా పనిచేసే పాత్రికేయులు, పరిశోధకులు డానిష్, రుహీ ఖాన్లు దీన్ని రచించారు.
భారత చట్టాలను తప్పించుకోవాలనుకునేవారికి బ్రిటన్ స్వర్గధామంగా మారడానికి కారణాలను ఇందులో వివరించినట్లు తెలిపారు. 12 కేసులను ఈ పుస్తకంలో ప్రస్తావించామని చెప్పారు. వాటిలో రుణ ఎగవేతల నుంచి హత్యల వరకు అనేక నేరాలు ఉన్నాయని పేర్కొన్నారు. నేర సామ్రాజ్యం క్రికెట్-బాలీవుడ్ మధ్య ఉన్న సంబంధాలు, భారత్-పాకిస్థాన్ దౌత్య యుద్ధాల గురించి ఇందులో ప్రస్తావించినట్లు తెలిపారు.
ఇదీ చదవండి : పంజాబ్ సరిహద్దులో పాక్ జాతీయుడు అరెస్ట్