ఛెతేశ్వర్ పుజారా.. జెంటిల్మెన్ క్రికెట్లో జెంటిల్మెన్. భారీ షాట్లు ఆడకపోవచ్చు, చూడచక్కని బౌండరీలు బాదకపోవచ్చు, గాల్లోకి బంతిని లేపకపోవచ్చు.. కానీ అతడు క్రీజులో ఉంటే ప్రత్యర్థి బౌలర్లకు వెన్నులో వణుకుపుడుతుంది. అతడికి బౌలింగ్ చేయాలంటే భయం వేస్తుంది. ఓపిక, పట్టుదల, బంతిని సరిగా అంచనా వేసే నైపుణ్యం టెస్టు క్రికెట్లో పుజారాను అందనంత ఎత్తులో నిలబెట్టాయి. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్ పుజారా సామార్థ్యాన్ని మరోసారి నిరూపించింది. ఎన్ని దెబ్బలు తగిలినా, నిప్పుల్లాంటి బంతులు బాడీ వైపు దూసుకొస్తున్నా.. వాటికి ఎదురొడ్డి గంటలు గంటలు క్రీజులో నిలుచున్న పుజారాను నయా వాల్ అనకుండా ఉండగలమా!. ఈరోజు పుజారా పుట్టినరోజు సందర్భంగా అతడి గురించి ప్రత్యేక కథనం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- బోర్డర్-గావస్కర్ సిరీస్లో భాగంగా టీమ్ఇండియా నయా వాల్ పుజారా ఎదుర్కొన్న బంతులు 928. 33.88 సగటుతో 271 పరుగులు సాధించాడు. ఇందులో 29 ఫోర్లు ఉన్నాయి. ఈ సిరీస్లో పుజారా తర్వాత ఎక్కువ బంతులు ఎదుర్కొంది అజింక్యా రహానె. ఇతడు 562 బంతుల్ని ఎదుర్కొన్ని 268 పరుగులు సాధించాడు.
- 2018-19 బోర్డర్ గావస్కర్ సిరీస్లో భాగంగా పుజారా ఎదుర్కొన్న బంతులు 1,258. 74.43 సగటుతో 521 పరుగులు సాధించాడు. ఇందులో 50 ఫోర్లు రెండు సిక్సులు ఉన్నాయి.
- గబ్బా వేదికగా జరిగిన చివరి టెస్టు ఐదో రోజు విజయానికి టీమ్ఇండియా 324 పరుగులు చేయాల్సి ఉంది. ఈ సమయంలో జట్టులో రెండో సీనియర్ బ్యాట్స్మన్గా ఉన్న పుజారా తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాడు. ఆరోజు 211 బంతులను ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో ఇతడి శరీరానికి 11 సార్లు బంతులు తగలడం గమనార్హం. ఇందులో రెండుసార్లు మాత్రమే తీవ్రంగా ఇబ్బందిపడ్డాడు. అయినా మొక్కవోని దీక్షతో ఆసీస్ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టాడు. వారు నిప్పులు చెరిగే బంతులతో కవ్విస్తున్నా.. హెల్మెట్, చేతి, ఛాతికి దెబ్బలు తగులుతున్నా.. దీర్ఘంగా శ్వాస పీల్చి మళ్లీ యుద్ధానికి సిద్ధమైన పుజారాను చూస్తుంటే బౌలర్లకు విసుగు, ప్రేక్షకులకు స్ఫూర్తి కలగడం మానదు.
- మొదటి రెండు టెస్టుల్లో నెమ్మదిగా బ్యాటింగ్ చేసిన కారణంగా పుజారా విమర్శలు ఎదుర్కొన్నాడు. అయినా ఎవ్వరి మాటలు పట్టించుకోకుండా తన బాధ్యతను తాను సక్రమంగా నిర్వర్తించాడు. మరో బ్యాట్స్మన్ పరుగులు చేయడానికి సహకరిస్తూ.. తాను టెస్టు క్రికెట్కు వన్నె తెచ్చే విధంగా డిఫెన్స్ ఆడుతూ ఆకట్టుకున్నాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- చివరి టెస్టులో 196 బంతుల్లో అర్ధసెంచరీ చేసి మరోసారి విమర్శలు ఎదుర్కొన్నా.. మ్యాచ్ గెలిచాక అతడిపైనే ప్రశంసల వర్షం కురిసింది. గిల్తో 91, పంత్తో 61 పరుగుల భాగస్వామ్యంతో టీమ్ఇండియాకు మరపురాని విజయాన్ని అందించాడు పుజారా. క్రీజులో పాతుకుపోయి, ఆసీస్ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టి వారి లయను దెబ్బతీసి భారత జట్టు గెలుపునకు కృషిచేసిన పుజారా ఆటతీరు అద్భుతమని చెప్పొచ్చు.
- పుజారా లేకుంటే టీమ్ఇండియా 3-0 తేడాతో సిరీస్ను కోల్పోయేది. టెస్టు క్రికెట్లో గంటల తరబడి క్రీజులో నిలవడమే ముఖ్యం. కానీ కొందరు చేస్తున్న విమర్శలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి" అంటూ పుజారా ఇన్నింగ్స్కు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ నిక్ కాంప్టన్ మద్దతు తెలిపాడు.
- పుజారా ఇప్పటివరకు తన కెరీర్లో 81 టెస్టు మ్యాచ్లు ఆడి 6,111 పరుగులు సాధించాడు. ఇందులో 3 ద్విశతకాలు, 18 శతకాలు, 28 అర్ధశతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 206గా ఉంది.