దిల్లీకి మెడికల్ ఆక్సిజన్ను అత్యవసరంగా సరఫరా చేయాలని కేంద్రాన్ని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కోరారు. పలు ఆసుపత్రుల్లో కొన్ని గంటలకు సరిపడా ఆక్సిజన్ నిల్వలు మాత్రమే ఉన్నట్లు చెప్పారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని వాణిజ్యం, పరిశ్రమలు శాఖ మంత్రికి కూడా కేజ్రీవాల్ లేఖ రాశారు.
"దిల్లీలో తీవ్రమైన ఆక్సిజన్ కొరత ఉంది. కొన్ని ఆసుపత్రుల్లో మరికొన్ని గంటలకు సరిపడా ఆక్సిజన్ మాత్రమే ఉంది. దిల్లీకి ఆక్సిజన్ను సరఫరా చేయాలని నేను కేంద్రాన్ని మరోసారి కోరుతున్నాను."
-అరవింద్ కేజ్రీవాల్, దిల్లీ ముఖ్యమంత్రి.
దిల్లీలో ఆక్సిజన్ వాడకాన్ని పరిశీలించేందుకుగాను 24 మంది సభ్యులతో కూడిన ఓ కమిటీని దిల్లీ ప్రభుత్వం సోమవారం ఏర్పాటు చేసింది.
'పట్టించుకోవట్లేదు'
దిల్లీలో ఆక్సిజన్ నిల్వలు కేవలం 8 నుంచి 12 గంటలకు మాత్రమే సరిపడా అందుబాటులో ఉన్నాయని దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా తెలిపారు. తాము వారం రోజులుగా దిల్లీకి సరఫరా చేసే ఆక్సిజన్ కోటాను పెంచాలని డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు.
"చాలా ఆసుపత్రుల్లో 8 నుంచి 12 గంటలకు సరిపడా ఆక్సిజన్ నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఎక్కువ ఆక్సిజన్ తక్షణమే అందుబాటులోఉంచితే.. ఎంతో మంది జీవితాలపై ప్రభావం ఉంటుంది. దిల్లీకి ఆక్సిజన్ కోటాను పెంచాలని మేం చేసిన వినతిపై కేంద్రం ఎలాంటి చర్యలు చేపట్టలేదు."
-మనీశ్ సిసోడియా, దిల్లీ ఉపముఖ్యమంత్రి.
సరఫరా పెంచండి..
రాజస్థాన్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. మెడికల్ ఆక్సిజన్ సరఫరాను పెంచాలని కేంద్రాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్యమంత్రి రఘు శర్మ కోరారు. తమ రాష్ట్రంలో 136 టన్నుల మెడికల్ ఆక్సిజన్ అవసరమైనప్పటికీ.. కేంద్రం 124 టన్నులను మాత్రమే కేటాయించిందని చెప్పారు. అందులోనూ.. 65 మెట్రిక్ టన్నులను మాత్రమే ఇప్పటివరకు సరఫరా చేసిందని తెలిపారు.
ఇదీ చూడండి: మహారాష్ట్రలో కఠిన లాక్డౌన్కు కేబినెట్ సిఫార్సు
ఇదీ చూడండి: 'రాముడి ఆదర్శాలను మనమూ పాటిద్దాం'