దేశంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెమిడెసివిర్ ఔషధం ఎగుమతులపై నిషేధం విధించింది. ఔషధ నిల్వల వివరాలను వెబ్సైట్లో ఉంచాలని.. రెమిడెసివిర్ నల్ల బజారుకు తరలకుండా ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది.
‘‘ప్రస్తుత పరిస్థితులు చక్కబడే వరకూ రెమ్డెసివిర్ను ఔషధ తయారీ సంస్థలు ఎగుమతి చేయొద్దు. 11వ తేదీ నాటికి దేశవ్యాప్తంగా 11 లక్షలకు పైగా కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజు రోజుకీ ఈ కేసుల సంఖ్య మరింత పెరుగుతోంది. దీంతో రెమ్డెసివిర్కు డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ఉత్పత్తిదారులు, పంపిణీదారులు రెమ్డెసివిర్ నిల్వలు దాచొద్దు. ఔషధ నిల్వల వివరాలను ఎప్పటికప్పుడు వెబ్సైట్ అందుబాటులో ఉంచాలి. రెమ్డెసివిర్ నిల్వలు నల్లబజారుకు తరలకుండా చర్యలు తీసుకోవాలి. డ్రగ్ ఇన్స్పెక్టర్లు, ఇతర అధికారులు ఔషధ నిల్వలను నిత్యం తనిఖీ చేయాలి’’
-కేంద్ర ప్రభుత్వం
కరోనా సెకండ్ వేవ్లో వేగంగా కేసులు పెరుగుతున్నాయి. ఆసుపత్రుల్లో చేరాల్సిన అవసరం ఏర్పడుతున్న వారి సంఖ్యా పెరుగుతోంది. కరోనా చికిత్సలో ముఖ్యంగా కరోనా బారిన పడి తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న వారికి రెమ్డెసివిర్ సమర్థంగా పనిచేస్తోన్న సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి: ఆ రాష్ట్రాల్లోనే 70శాతం కరోనా కేసులు