కరోనా కారణంగా మరణించిన వారి కుటుంబ సభ్యులకు రూ.4 లక్షల పరిహారం అందించేలా ఆదేశించాలని దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టింది సుప్రీం కోర్టు. ఇరు పక్షాల వాదనల అనంతరం తీర్పును రిజర్వ్ చేసింది.
విపత్తు నిర్వహణ చట్టం 2005 సెక్షన్ 12 ప్రకారం.. ప్రకృతి విపత్తులతో మరణించిన వారికి రూ.4లక్షల పరిహారం పొందే హక్కుందని పిటిషనర్లలో ఒకరైన గౌరవ్ కుమార్ బన్సల్ వాదించారు. ఏప్రిల్ 8, 2015 నాటి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. విపత్తు కారణంగా మరణించిన వ్యక్తి కుటుంబానికి రూ.4 లక్షల పరిహారం లభిస్తుందని, కరోనాను ప్రభుత్వం విపత్తుగా పరిగణించిందని గుర్తుచేశారు.
కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది ఎస్.బి ఉపాధ్యాయ వాదనలు వినిపించారు. ఈ అంశంపై వాదనలు విన్న జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎంఆర్ షాల ప్రత్యేక ధర్మాసనం.. మూడు రోజుల్లో లిఖితపూర్వక సమాధానంతో రావాలని పిటిషన్దారులకు సూచించింది.
'పరిహారం ఇవ్వలేం..'
కొవిడ్ కారణంగా మరణించిన బాధిత కుటుంబాలకు పరిహారం అందించలేమని ఇప్పటికే ప్రమాణ పత్రం దాఖలు చేసింది కేంద్రం. వివిధ రూపాల్లో పరిహారం అందించామని.. ఈ అంశంపై చాలా రాష్ట్రాలు చర్యలు చేపడుతున్నాయని సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చింది.
ధ్రువీకరణ పత్రాల జారీలో వేగం..
కరోనా కారణంగా మరణించిన వారిపై ఆధారపడిన కుటుంబసభ్యులకు ధృవీకరణ పత్రాలను మంజూరు చేసే ప్రక్రియను సరళతరం చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. దేశంలో కరోనా కారణంగా పెద్దఎత్తున మరణాలు సంభవించాయని అందువల్ల మరణ ధ్రువీకరణ పత్రాలు వేగంగా జారీ చేయాల్సిన అవసరాన్ని రీపక్ కన్సల్ అనే వ్యక్తి కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. బాధితులు, వారి కుటుంబ సభ్యులను చూసుకోవాల్సిన బాధ్యతను నెరవేర్చేలా రాష్ట్రాలను ఆదేశించాలని కన్సల్ కోర్టుకు విన్నవించారు.
ఇవీ చదవండి: