రెండో దశ కొవిడ్ ఉద్ధృతితో దేశం వణికిపోతోంది. మహారాష్ట్ర, పంజాబ్, గుజరాత్, మధ్యప్రదేశ్లో రోజురోజుకూ రెట్టింపు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే రోజుకు 60వేలకు పైగా పాజిటివ్ కేసులు బయడపడుతుండగా త్వరలోనే లక్షకు చేరుతాయనే ఆందోళన నెలకొంది. దీంతో మరోసారి లాక్డౌన్ విధిస్తారేమోనని ప్రజలు గుబులు చెందుతున్నారు.
అయితే లాక్డౌన్ విధించప్పటికీ కఠిన ఆంక్షలు, రాత్రి కర్ఫ్యూలను అమలు చేస్తున్నాయి పలు రాష్ట్రాలు. అసలే పండుగ సీజన్ అయినందున బహిరంగ ప్రదేశాల్లో ఉత్సవాలపై నిషేధాజ్ఞలు జారీచేశాయి. తెలంగాణ సహా ఏఏ రాష్ట్రాల్లో ఎలాంటి ఆంక్షలు విధించారో చూద్దాం.
తెలంగాణ
కరోనా వ్యాప్తి దృష్ట్యా పండుగలు, ర్యాలీలపై నిషేధం విధించింది తెలంగాణ ప్రభుత్వం.
⦁ బహిరంగ ప్రదేశాలు, పనిచేసే ప్రదేశాలు, ప్రజారవాణా వాహనాల్లో మాస్కులు తప్పనిసరి
⦁ షబ్-ఏ-రాత్, హోలీ, ఉగాది, శ్రీరామనవమి, మహవీర్ జయంతి, గుడ్ ఫ్రైడే, రంజాన్ తదితర మతపరమైన పండుగలు, కార్యక్రమాల సందర్భంగా బహిరంగ ఉత్సవాలు, ర్యాలీలపై నిషేధం
⦁ ర్యాలీలు, ప్రజలు గుమిగూడడం, ఒకేచోట చేరడంపై ఆంక్షలు
⦁ ఏప్రిల్ 30వ తేదీ వరకు ఎలాంటి ర్యాలీలు, ఉత్సవాలకు అనుమతి లేదు
⦁ మాస్కులు ధరించని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై విపత్తు నిర్వహణా చట్టం కింద చర్యలు
మహారాష్ట్ర
దేశంలో అత్యధిక కేసులు నమోదవుతున్న రాష్ట్రం మహారాష్ట్ర. దీంతో అక్కడి ప్రభుత్వం శనివారం(మార్చి 27) నుంచి రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తోంది.
⦁ ఏప్రిల్ 15 వరకు రాత్రి 8 నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ, ఉల్లంఘిస్తే.. రూ.వెయ్యి జరిమానా
⦁ కరోనా ఆంక్షలు పాటిస్తూ ఉత్సవాలు
⦁ నవీ ముంబయిలో 'ఆల్ అవుట్' పేరిట నిబంధనలు ఉల్లఘించినవారిపై పోలీసుల చర్యలు
⦁ మార్చి 30 నుంచి ఏప్రిల్ 8 వరకు ఔరంగాబాద్లో లాక్డౌన్
⦁ కొంకణ్ జిల్లాలోకి పరీక్షలు చేసిన తర్వాతే ప్రవేశం
⦁ బుల్దానాలో దుకాణదారులు,హోటల్ నిర్వాహకులకు కరోనా పరీక్షలు తప్పనిసరి
⦁ అహ్మద్నగర్లో ఆంక్షలు పాటించని దుకాణాలు మూసివేత
గోవా
⦁ హోలీ, ఈస్టర్ సహా తదితర పండుగల నేపథ్యంలో సెక్షన్ 144 విధింపు
⦁ బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు గుమిగూడడం, పండుగలు, మతపరమైన ఉత్సవాలపై నిషేధం
⦁ శిగ్మో ఫెస్టివల్ పరేడ్ రద్దు
కర్ణాటక
⦁ బహిరంగ ప్రదేశాలు, పార్కులు, మార్కెట్లు, ప్రార్థనా స్థలాల్లో ప్రజలు గుమిగూడడంపై నిషేధం
⦁ మైదానాలు, బహిరంగ ప్రదేశాల్లో ఉత్సవాలపై నిషేధం
గుజరాత్
⦁ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారు తప్పనిసరిగా నెగటివ్ కొవిడ్ 19 ఆర్టీ-పీసీఆర్ టెస్టు రిపోర్ట్ తీసుకురావాలని ఆదేశం
⦁ ఏప్రిల్ 1 వరకు ఈ ఉత్తర్వులు అమలు
దిల్లీ
⦁ వివాహాలకు హాజరయ్యే వారి సంఖ్యపై పరిమితులు. లోపల జరిగే పెళ్లిళ్లకు గరిష్ఠంగా 100 మంది, ఆరుబయట జరిగే కల్యాణాలకు గరిష్ఠంగా 200 మందికి మాత్రమే అనుమతి. మాస్కులు తప్పనిసరి.
⦁ అంత్యక్రియలకు గరిష్ఠంగా 50 మందికి మాత్రమే అనుమతి.
⦁ పండుగల వేళ వేడుకలను పర్యవేక్షించనున్న విజిలెన్స్ బృందం
⦁ ఉత్సవాలకు ఒక చోట చేరరాదని ప్రజలకు సూచన
⦁ రాజధాని వెలుపల నుంచి వచ్చే వ్యక్తులకు రైల్వే స్టేషన్, విమానాశ్రయాల్లో కొవిడ్ పరీక్షలు
ఇదీ చూడండి: దేశంలో మరో 62,714 కరోనా కేసులు