దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ దృష్ట్యా ఆక్సిజన్ కొరత ఏర్పడిన నేపథ్యంలో.. ప్రాణవాయువు అవసరాలు, సరఫరాపై జాతీయ స్థాయిలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ తొలిసారిగా సమావేశమైంది. ఈ క్రమంలో ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంలో, దానిని సమర్థవంతంగా పంపిణీ చేయడంలో వివిధ మంత్రిత్వ శాఖలు, పలు విభాగాలు చేసిన కృషిని జాతీయ టాస్క్ ఫోర్స్ సభ్యులు ప్రశంసించారు.
ఈ టాస్క్ఫోర్స్లో బెంగాల్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెన్స్ మాజీ ఉపకులపతి డాక్టర్ భబతోష్ బిశ్వాస్ కమిటికి నేతృత్వం వహించారు. గురుగ్రామ్లోని మేదాంత హాస్పిటల్ అండ్ హార్ట్ ఇన్స్టిట్యూట్ ఎండీ డాక్టర్ నరేశ్ ట్రెహాన్, దిల్లీలోని గంగారామ్, తమిళనాడు రాయవెల్లూర్ క్రిస్టియన్ మెడికల్ కాలేజీ, బెంగళూరులోని నారాయణ హెల్త్కేర్, ముంబయిలోని ఫోర్టిస్ ఆసుపత్రుల్లోని ప్రముఖ వైద్యులు ఈ కార్యదళంలో సభ్యులుగా సమావేశం జరిగింది. ఈ భేటీకి కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్తో పాటు కేంద్ర కార్యదర్శి గిరిధర్ అరమణే కూడా హాజరైనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
అంతేకాకుండా.. ఆదివారం జరిగిన ఈ సమావేశానికి వీకే పౌల్ (నీతీ ఆయోగ్ సభ్యుడు), రణదీప్ గులేరియా (ఎయిమ్స్ డైరెక్టర్), బలరాం భార్గవ్(ఐసీఎంఆర్ డైరెక్టర్), సునీల్ కుమార్(ఆరోగ్యశాఖ)లు ప్రత్యేక అతిథిలుగా హాజరయ్యారు.
దేశవ్యాప్తంగా శాస్త్రీయంగా, హేతుబద్దతతో సమానంగా ఆక్సిజన్ను పంపిణీ చేయాల్సిన బాధ్యతను ఈ టాస్క్ఫోర్స్కు అప్పగించింది సుప్రీం ధర్మాసనం.
ఇదీ చూడండి: ఆక్సిజన్ అవసరాలపై జాతీయ టాస్క్ఫోర్స్