ఉత్తర్ప్రదేశ్ కాన్పుర్ దేహత్లోని స్వగ్రామం పరౌఖ్ చేరిన వేళ భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ భావోద్వేగానికి లోనయ్యారు. ఆదివారం పరౌఖ్లో అడుగుపెట్టగానే.. వంగి నేలను తాకి గౌరవ వందనం చేశారు. పర్యటన సందర్భంగా డా. బి.ఆర్ అంబేడ్కర్ విగ్రాహానికి నివాళి అర్పించిన ఆయన.. ఆ తర్వాత మిలాన్ కేంద్రాన్ని సందర్శించారు.
![President Ram Nath Kovind](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12280036_1.jpg)
![President Ram Nath Kovind](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12280036_4.png)
అనంతరం గ్రామంలోని వీరనారి ఝల్కరీ బాయి ఇంటర్ కళాశాలలో ప్రజా ఆత్మీయ సమ్మేళనంలో కోవింద్ మాట్లాడారు. తన గతాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు.
![President Ram Nath Kovind](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12280036_5.png)
![President Ram Nath Kovind](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12280036_2.png)
"గ్రామాల నుంచి వచ్చిన నా లాంటి సాధారణ బాలుడు దేశంలోనే అత్యున్నత పదవి చేపడతాడని కలలో కూడా ఊహించలేదు. కానీ మన ప్రజాస్వామ్య వ్యవస్థ దానిని చేసి చూపెట్టింది. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధుల త్యాగాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం.. ఈ నేల, మీ ప్రేమ, ఆదరాభిమానాలే. ఈ ఊరి జ్ఞాపకాలు ఎల్లప్పుడూ నా మదిలోనే ఉంటాయి. పరౌఖ్ అంటే కేవలం ఓ ఊరు కాదు.. నా మాతృభూమి. అదే నాకు దేశానికి సేవ చేయాలనే ప్రేరణ కలిగించింది."
- రామ్నాథ్ కోవింద్, భారత రాష్ట్రపతి
మాతృభూమి ఇచ్చిన స్ఫూర్తితోనే హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు, అక్కడి నుంచి రాజ్యసభ, రాజ్భవన్.. ప్రస్తుతం రాష్ట్రపతి భవన్కు చేరుకున్నట్లు కోవింద్ తెలిపారు.
స్వగ్రామంలోని బాల్య మిత్రులు, బంధువులను కలుసుకోవడానికి సతీమణి సవితా దేవితో కలిసి శుక్రవారం దిల్లీ నుంచి కాన్పుర్ రైలు ప్రయాణం చేశారు కోవింద్. కాన్పుర్ సెంట్రల్ రైల్వే స్టేషన్లో యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆయనకు స్వాగతం పలికారు.
![President Ram Nath Kovind](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12280036_3.png)
టీకాయే రక్షణ కవచం..
కరోనా మహమ్మారి వేళ పర్యటన చేపట్టిన రాష్ట్రపతి.. టీకాలు వైరస్ నుంచి రక్షణ కవచాలని అన్నారు. అందరూ టీకా వేయించుకోవాలని కోరారు. ప్రత్యేక విమానంలో జూన్ 29న ఆయన దిల్లీకి తిరుగుపయనమవుతారు.
ఇదీ చూడండి: రాష్ట్రపతి రైలు ప్రయాణం- 15 ఏళ్లలో తొలిసారి..