అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. బంగాల్లో 20 ర్యాలీలు, అసోంలో 6 బహిరంగ సభలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు రాష్ట్రాల్లోని భాజపా నేతల కోరిక మేరకు పలు ర్యాలీలకు మోదీ వస్తారని సమాచారం.
బంగాల్లోని 23 జిల్లాలు, అసోంలోని 33 జిల్లాలవ్యాప్తంగా ఈ ర్యాలీలు నిర్వహించేందుకు భాజపా వ్యూహరచన చేస్తోంది. "ఎన్నికలు జరగనున్న అన్ని రాష్ట్రాల్లో ప్రధాని పర్యటించాల్సి ఉంది. కానీ.. బంగాల్, అసోంలపై భాజపా మరింత దృష్టి పెట్టింది." అని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
ఈ మేరకు మార్చి 7న కోల్కతా బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో జరగనున్న భారీ ర్యాలీ కోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో.. బంగాల్లో మోదీ హాజరుకానున్న మొదటి ర్యాలీ ఇదే కానుంది.
ముందస్తు చర్చలు..
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, పార్టీ కార్యకలాపాల గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చర్చించనున్నారు. బంగాల్లోని భాజపా కార్యనిర్వాహక బృందం ఆధ్వర్యంలో బుధవారం ఈ సమావేశం జరగనుంది.
మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 వరకు 8 దశల్లో బంగాల్ ఎన్నికలు జరగనున్నాయి. మే 2న ఫలితాలు రానున్నాయి.
అసోంలో మార్చి 27 నుంచి ఏప్రిల్ 6 వరకు 3 దశల్లో పోలింగ్ నిర్వహించనుంది ఎన్నికల సంఘం.
ఇదీ చదవండి:కేరళను మళ్లీ పట్టేస్తారా? బంగాల్లో పోటీ ఇస్తారా?