విద్యార్థుల బంగారు కలలను నెరవేర్చే దిశగా కృషి చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. గుజరాత్ సూరత్లో బాలుర వసతి గృహానికి శంకుస్థాపన చేశారాయన. దీనిని సౌరాష్ట్ర పటేల్ సేవా సమాజ్ నిర్మిస్తోంది.
వెనుకబడిన వర్గాల విద్యార్థులకు తోడ్పాటునందించేందుకు సౌరాష్ట్ర పటేల్ సేవా సమాజ్ కృషి చేస్తోందని ప్రధాని మోదీ కొనియాడారు. 2024 నాటికి హాస్టల్ నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు. అభివృద్ధికి వర్గాలు, కులాలు అడ్డంకులు కాకూడదన్న సర్దార్ పటేల్ మాటలను ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాలని ఈ సందర్భంగా మోదీ సూచించారు.
రాజకీయ నేపథ్యం లేకున్నా.. 20ఏళ్లుగా ప్రభుత్వాధినేతగా..
తన రాజకీయ జీవితంపై మాట్లాడిన మోదీ.. కేవలం ప్రజల ఆశీస్సులతోనే గడిచిన 20ఏళ్లుగా ప్రభుత్వాధినేతగా కొనసాగుతున్నానని అన్నారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం, వంశపారంపర్య మద్దతు లేకున్నా దేశానికి సేవ చేసే అవకాశం ప్రజలు కల్పించారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఓ సామాన్య కుటుంబం నుంచి వచ్చిన తనకు గుజరాత్ సీఎం నుంచి నేడు ప్రధానమంత్రిగా సేవలందించే భాగ్యం కల్పించారన్నారు.
సామాన్య కుటుంబ నేపథ్యం నుంచి వచ్చాను. నాకు రాజకీయ, వంశపారపర్య లేదా ప్రత్యేకంగా కులాల మద్దతు లేదు. అయినప్పటికీ మీ అందరి ఆశీర్వాదంతో 2001 నుంచి గుజరాత్కు సేవ చేసే అవకాశాన్ని కల్పించారు. ఆ ఆశీర్వాదాలు బలంగా ఉండడం వల్లే 20 ఏళ్లైనా దేశ సేవలో కొనసాగుతున్నా. గుజరాత్ సీఎం నుంచి ప్రస్తుతం దేశ ప్రధానిగా సేవచేసే అవకాశం కల్పించారు.
-ప్రధాని నరేంద్ర మోదీ
పుంజుకున్న ఆర్థిక వ్యవస్థ..
కరోనా సంక్షోభం అనంతరం భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.
"కరోనా మహమ్మారి వంటి క్లిష్ట దశ అనంతరం.. భారత ఆర్థిక వ్యవస్థ చాలా వేగంగా కోలుకుంది. దీనితో ప్రపంచమంతా భారత్ వైపు ఆశగా చూస్తోంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అవతరించబోతోందని అంతర్జాతీయ సంస్థలు ఇటీవల పేర్కొన్నాయి."
-ప్రధాని నరేంద్ర మోదీ
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ 9.5 శాతం వృద్ధి చెందుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి అంచనా వేసింది. మహమ్మారి వల్ల వచ్చిన ఆరోగ్య సమస్యలు, సరఫరా అంతరాయాలు, ధరల పెరుగుదల ఒత్తిడి వంటి అంశాలను మోదీ ప్రస్తావించారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్ ఉంది.
ఇదీ చదవండి:'భారత సంప్రదాయాలకు వ్యతిరేకంగా కుట్రలు'