కేరళలోని కొచ్చి-మంగళూరు సహజ వాయువు పైప్లైన్ను ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రారంభించి జాతికి అంకితమివ్వనున్నారు. వర్చువల్గా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు మోదీ. ఈ పైప్లైన్ ప్రాజెక్ట్.. 'ఒకే దేశం- ఒకే గ్యాస్ గ్రిడ్' ఏర్పాటుకు మైలురాయి వంటిదని ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
ఎర్నాకుళం, త్రిస్సూర్, పాలక్కడ్, మలప్పురం, కోజికోడ్, కన్నూర్, కాసర్గోడ్ మీదుగా.. 450 కిలోమీటర్ల పొడవైన ఈ పైప్లైన్ను గెయిల్(ఇండియా) లిమిటెడ్ నిర్మించింది. ఈ మార్గం ద్వారా రోజుకు 1.20 కోట్ల మెట్రిక్ ప్రామాణిక క్యూబిక్ మీటర్ల రవాణా సామర్థ్యంతో కొచ్చి నుంచి మంగళూరుకు ఎల్పీజీ(లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్)ను సరఫరా కానుంది. ఈ ప్రాజెక్ట్ మొత్తం వ్యయం రూ.3వేల కోట్లు కాగా.. దీని వల్ల సుమారు 12లక్షల మంది ఉపాధి పొందినట్టు సమాచారం.
ఈ పైప్లైన్ ద్వారా పర్యావరణ రహిత, సరసమైన ఇంధనాన్ని పైప్డ్ నేచురల్ గ్యాస్(పీఎన్జీ) రూపంలో గృహాలకు, కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్(సీఎన్జీ)ను రవాణా రంగానికి సరఫరా చేయనున్నారు.
ఇదీ చదవండి: 2020లో ప్రసార భారతి 'డిజిటల్' హిట్