కొవిడ్ 19 వ్యాక్సిన్ 'కొవిషీల్డ్' మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ఎన్రోల్మెంట్ ప్రక్రియ పూర్తయినట్లు పుణె కేంద్రంగా పని చేస్తున్న సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ), భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) సంయుక్తంగా గురువారం ప్రకటించాయి. అమెరికాకు చెందిన నోవావాక్స్ అభివృద్ధి చేసిన ఈ టీకా క్లినికల్ ట్రయల్స్ కోసం ఐసీఎంఆర్, ఎస్ఐఐలు కలిసి పనిచేస్తున్నాయి.
మహమ్మారి సృష్టించిన విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు.. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు జట్టుకట్టడం మంచి పరిణామంగా ఐసీఎంఆర్ అభివర్ణించింది. ఈ భాగస్వామ్యం ద్వారా వ్యాక్సిన్ ట్రయల్స్లోని సైట్ రుసుముల కోసం ఐసీఎంఆర్ నిధులు సమకూర్చగా.. ఇతర ఖర్చులకు సీరం నిధులు అందించింది.
ప్రస్తుతం ఎస్ఐఐ, ఐసీఎంఆర్లు కొవిషీల్డ్ వ్యాక్సిన్ 2/3 దశల క్లినికల్ ట్రయల్స్ను దేశంలోని 15 వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహిస్తున్నాయి. అక్టోబర్ 31 నాటికే 1,600 మంది ట్రయల్స్ కోసం ఎన్రోల్మెంట్ చేసుకున్నారు. క్లినికల్ ట్రయల్స్ ద్వారా ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలను పరిశీలిస్తే.. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఈ టీకా కచ్చితమైన పరిష్కారం ఇస్తుందని ఐసీఎంఆర్ ఆశాభావం వ్యక్తం చేసింది. కొవిషీల్డ్ భారత్లో పరీక్షలు నిర్వహిస్తున్న అత్యాధునిక వ్యాక్సిన్గా పేర్కొంది.
ఇదీ చూడండి:ఐఐఎస్సీ నుంచి వేడిని తట్టుకునే కరోనా వ్యాక్సిన్!