ఎంపీల్యాడ్స్ నిధులను పునరుద్ధరించాలని కాంగ్రెస్, టీఎంసీతో సహా ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. సోమవారం నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమవనున్న నేపథ్యంలో.. ఆదివారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తాయి.
కరోనా కారణంగా ఎంపీల్యాడ్స్ నిధులను నిలిపివేస్తున్నట్టు గతేడాది ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. తాజాగా.. లోక్సభలో కాంగ్రెస్ సభాపక్షనేత అధిర్ రంజన్ చౌధరి, టీఎంసీ నాయకుడు సుదీప్ బందోపాధ్యాయ వంటి నాయకులు ఎంపీ ల్యాండ్స్ నిధుల గురించి ప్రశ్నించారు. అయితే.. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ప్రశ్నించడానికి ప్రతిఒక్కరికీ తగిన సమయం కేటాయిస్తామని ఓం బిర్లా అన్నారు. సమావేశాలు జరగడానికి సహకరించాలని ప్రతిపక్షాలను కోరారు. సభ గౌరవాన్ని కాపాడాలని విన్నవించారు. పార్లమెంట్ సమావేశాలు జరగడానికి సహకరిస్తామని ప్రతిపక్షాలు కూడా హామీనిచ్చాయి.
ప్రధాని నరేంద్ర మోదీతో సహా వివిధ పార్టీల అధ్యక్షులు సమావేశానికి హాజరయ్యారు.
అందుకు అంగీకరించం..
పార్లమెంట్ అనెక్స్ భవనంలో.. కరోనాపై ఉభయ సభలలోని ఎంపీలందరితో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం నిర్వహించడానికి సుముఖంగా ఉన్నట్టు అధికార పక్షం వెల్లడించింది. అయితే దీనిపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఇది అసాధారణమని, సభానియమాలను ఉల్లంఘించడమేనని ఆరోపించాయి. ఏ అంశాన్నైనా సభలోనే చర్చించాలని తేల్చిచెప్పాయి. కాన్ఫరెన్స్ గదిలో కరోనాపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను అంగీకరించమని టీఎంసీ నాయకుడు డెరెక్ ఓబ్రెయిన్ అన్నారు.