ఉన్నత విద్యను అభ్యసించాలని కలలు కన్న ఓ యువకుడికి వేల మంది ఆపన్నహస్తం అందించారు. చదువుకునేందుకు డబ్బు కావాలని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన 3 గంటల్లోనే రూ. 37 లక్షలు డొనేషన్ రూపంలో అందించారు. ఈ ఘటన ఒడిశా కోరాపుట్లో జరిగింది.

ఆక్స్ఫర్డ్ లక్ష్యంగా..
దక్షిణ ఒడిశా కోరాపుట్ జిల్లాలోని మావోల ప్రాంతమైన తెంతులిపదార్ గ్రామానికి చెందిన సుమిత్ తురుక్.. ఆక్స్ఫర్డ్లో ఉన్నత విద్యను పూర్తి చేసుకోవాలని అనుకున్నాడు. కానీ, ఆర్ధికంగా వెనకబడి ఉన్నందున.. తన ఆశ నెరవేరదేమోనని బాధపడ్డాడు. ఈ నేపథ్యంలో ఆక్స్ఫర్డ్లో చదువుకునేందుకు కావాల్సిన రూ. 47 లక్షలు ఒడిశా సర్కారు నుంచైనా పొందాలని అనుకున్నాడు. కానీ, విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసానికి సర్కారు సాయం చేయలేదని తెలుసుకున్నాడు.
ఈ క్రమంలో.. ఇంగ్లాండ్కు వెళ్లేందుకు అనుమతి లభించిన వివరాలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. అంతే.. మూడు గంటల్లో అతనికి డొనేషన్ల రూపంలో రూ. 37లక్షలు అందాయి. జూన్ 30 కల్లా మిగతా 10 లక్షల రూపాయలు సేకరించగలనని ధీమా వ్యక్తం చేశాడు.
చదువు పూర్తయ్యాక.. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల ఉన్నత విద్యకోసం సాయం అందిస్తానని తెలిపాడు తురుక్.
జేఎన్యూలో..
తొలుత దిల్లీ యూనివర్సిటీ అనుబంధ కళాశాలల్లో చదవాలని తురుక్ ఆశించాడు. కానీ, ఆర్థికంగా బలహీనంగా ఉన్న కారణంగా ఆశించిన కాలేజీలో సీటు సంపాదించలేకపోయాడు. ఆయినా.. నిరాశపడకుండా చదవి.. దిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో సీటు సంపాదించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అనంతరం పైచదువుల కోసం ఆక్స్ఫర్డ్ వెళ్లాలని ఆశిస్తున్నాడు.
ఇదీ చదవండి:వారం రోజుల్లో ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి