కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీల తదుపరి అధ్యక్షులు(next congress president) ఎవరో ప్రతిఒక్కరికీ తెలుసునన్నారు ఉత్తర్ప్రదేశ్ న్యాయ శాఖ మంత్రి బ్రజేశ్ పతాక్. రానున్న 2022 అసెంబ్లీ ఎన్నికల్లో అధికార భారతీయ జనతా పార్టీ 350 సీట్లకుపైగా గెలుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
బదౌన్ జిల్లా కేంద్రంలోని పరశురామ్ చౌక్లో నిర్మించిన భగవాన్ పరశురామ్ విగ్రహం ప్రారంభించారు బ్రజేశ్. అనంతరం మాట్లాడుతూ విపక్షాలపై విమర్శలు గుప్పించారు.

"కాంగ్రెస్ పార్టీ తదుపరి జాతీయ అధ్యక్షుడు(congress president)ఎవరో అందరికీ తెలుసు. రాహుల్ గాంధీ(rahul gandhi news) వివాహం తర్వాత.. ఆయన కుమారుడే కాంగ్రెస్కు జాతీయ అధ్యక్షుడు అవుతారు. అదే క్రమంలో అఖిలేశ్ యాదవ్ కుమారుడే సమాజ్ వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అవుతారు. అది ప్రతిఒక్కరికీ తెలుసు. కానీ, భారతీయ జనతా పార్టీ తదుపరి అధ్యక్షుడు ఎవరనేది ఒక్కరు కూడా చెప్పలేరు."
- బ్రజేశ్ పతాక్, యూపీ న్యాయశాఖ మంత్రి.
2022 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి భాజపా మళ్లీ అధికారాన్ని చేబడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు బ్రజేశ్. ప్రతిపక్షాలు అధికారం కోసం మరో ఐదేళ్లు ఎదురుచాడాల్సి వస్తుందన్నారు. భాజపా కార్యకర్తలు మాత్రమే ప్రజలకు సేవ చేస్తూ.. వారితో పాటు కలిసిపోతున్నారని గుర్తు చేశారు. విపక్షాలకు సరైన విధానాలు లేవన్నారు. గత ఎన్నికల్లో వారిని ప్రజలు తిరస్కరించారని, 2022లోనూ అదే పునరావృతమవుతుందని తెలిపారు.
ఇదీ చూడండి: 'యూపీలో భాజపాదే మళ్లీ అధికారం- 300 సీట్లు ఖాయం!'