సాగు చట్టాలను రద్దు చేయాలని పోరాడే రైతు సంఘాలతో కేంద్రం సున్నితంగా వ్యవహరిస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. ఇప్పటివరకు జరిగిన చర్చల్లో రైతులకు అనుగుణంగా కేంద్రమే ఏకపక్షంగా ప్రతిపాదనలు ఇచ్చినా.. ఏ కారణం లేకుండానే రైతు సంఘాలు వాటిని తిరస్కరించాయని చెప్పారు. ఏ ప్రతిపాదనలు లేని కారణంగానే రైతు సంఘాలు చర్చలకు రావట్లేదని అన్నారు.
" కొత్త ప్రతిపాదనలతో చర్చలకు రావాలని రైతు సంఘాలను కేంద్రం కోరింది. ఏ ప్రతిపాదనలు లేని కారణంగానే చర్చలకు రావట్లేదు. చర్చలకు ఏ సమయంలోనైనా కేంద్రం సిద్ధంగా ఉంది. రైతు క్షేమమే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం పనిచేస్తోంది. రైతులను ధనవంతులుగా మార్చడానికే ప్రయత్నిస్తున్నాం. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా 1.8 కోట్ల రైతులకు 1.37 లక్షల కోట్లు లబ్ధి చేకూర్చాం. జీడీపీలో రైతుల వాటా కూడా పెరిగింది."
నరేంద్ర సింగ్ తోమర్,కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి
కేంద్రం నూతన సాగు చట్టాలను తీసుకువచ్చింది. వీటిపై రైతు సంఘాలు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నాయి. కొత్త చట్టాలతో రైతులకు తీరని నష్టం జరుగుతుందని ఆరోపిస్తున్నాయి. కనీస మద్దతు ధర తగ్గుదలతో సహా ప్రైవేటు కంపెనీల చేతిలో రైతులు బలవుతారని పలు అంశాలతో కేంద్రంతో చర్చలు జరిపాయి. చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే పలు దఫాల చర్చలు ముగిసినా కొలిక్కి రాలేదు. చట్టాలతో రైతులకు మేలు చేకూరుతుందని కేంద్రం చెబుతోంది.
ఇవీ చదవండి:'అప్పటివరకు దిల్లీ సరిహద్దులను వీడబోం'