Kiran Verma Blood Donation : దిల్లీకి చెందిన కిరణ్ వర్మ అనే సామాజిక కార్యకర్త రక్తదానంపై అవగాహన కల్పించడానికి 21 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నారు. 2021 డిసెంబర్ 28న కేరళలోని తిరువనంతపురంలో ప్రారంభించిన ఈ పాదయాత్ర ఇటీవల నాగాలాండ్లోని కోహిమా జిల్లాకు చేరుకుంది. 2025 డిసెంబరు 31 నాటికి 21 వేల కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేయాలన్నదే కిరణ్ వర్మ లక్ష్యం. ఇప్పటివరకు 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పాదయాత్ర చేశారు. ప్లకార్డును చేతిలో పట్టుకుని సుమారు 229 జిల్లాల్లో ఇప్పటివరకు 17,700 కిలోమీటర్లు నడిచారు. రక్తదానం చేసి మరొకరి ప్రాణాలు కాపాడమని ప్రజలను కోరుతున్నారు.
![Kiran Verma Blood Donation](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/03-12-2023/20170878_kiran_verma-1.jpg)
దేశవ్యాప్తంగా 50 లక్షల మంది కొత్తవారిని రక్తం దానం చేసేలా ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు కిరణ్ వర్శ. 2025 డిసెంబర్ 31 తర్వాత రక్తం కోసం ఎదురుచూస్తూ ఎవరూ చనిపోకూడదని సూచిస్తున్నారు. రక్తదానంపై అవగాహనకు ఎక్కువ దూరం పాదయాత్ర చేసిన వ్యక్తిగా రికార్డుకెక్కాలని కిరణ్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈయన చేసిన పాదయాత్రకు విశేష స్పందన వస్తోంది. కిరణ్కు మద్దతుగా దేశవ్యాప్తంగా 126 రక్తదాన శిబిరాలు నిర్వహించి 26,722 యూనిట్ల రక్తాన్ని సేకరించారు.
![Kiran Verma Blood Donation](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/03-12-2023/20170878_kiran_verma-2.jpg)
"ప్రజల దగ్గర నుంచి స్పందన మంచిగానే వస్తోంది. ఇప్పటి వరకు 120 కంటే ఎక్కువ రక్తదాన శిబిరాలను నిర్వహించాను. సుమారు 30 వేల మంది రక్తదానం చేశారు. అలానే 10 వేల మందికి పైగా ప్రజలు నేరుగా బ్లడ్ బ్యాంక్కు వెళ్లి రక్తదానం చేశారు. నేను ఇప్పటివరకు వివిధ ప్రాంతాలకు చెందిన 20 లక్షల మందికి పైగా ప్రజలను కలిశాను. ఈ పాదయాత్ర పూర్తయ్యే సరికి భారతదేశంలో 10 కోట్ల మంది ప్రజలను కలుసుకుంటాను." - కిరణ్ వర్మ, సామాజిక కార్యకర్త