ఇంటి వద్దకే రేషన్ సరకులు అందించే పథకాన్ని ప్రారంభించాలని ప్రయత్నిస్తున్న దిల్లీ సర్కారుపై భాజపా అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర తీవ్ర విమర్శలు చేశారు. ఈ స్కీమ్ ఓ పెద్ద స్కామ్ అని ఎద్దేవా చేశారు. ఈ పథకం పేరుతో కేజ్రీవాల్.. రాజకీయ డ్రామాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
"దేశప్రజలను తప్పుదోవ పట్టించాలని అరవింద్ కేజ్రీవాల్ యత్నిస్తున్నారు. ఆయన చేస్తున్న డ్రామాలను నేను స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. ఇంటి వద్దకే రేషన్ పంపిణీ పథకాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అడ్డుకుంటున్నారని ఓ ప్రచారాన్ని ఆయన ప్రారంభించారు. ఇది పూర్తి అసత్యం. వన్ రేషన్- వన్ నేషన్ విధానాన్ని తీసుకువచ్చిందే కేంద్ర ప్రభుత్వం. దాన్ని అమలు చేసేందుకు దిల్లీ ప్రభుత్వం నిరాకరించింది. తద్వారా వేలాది మంది వలస కార్మికులు ఈ పథకం ప్రయోజనాలను పొందలేకపోయారు."
- సంబిత్ పాత్ర, భాజపా అధికార ప్రతినిధి
రేషన్ డోర్ డెలివరీ చేస్తామని కేజ్రీవాల్ చెబుతున్నప్పటికీ.. అది అర్హులైన వారి వద్దకు ఎలా చేరుతుందని సంబిత్ పాత్ర ప్రశ్నించారు. దిల్లీ ప్రభుత్వం రేషన్ పంపిణీ చేసేటప్పుడు ఆధార్ ధ్రువీకరణను పాటించట్లేదని చెప్పారు. జాతీయ ఆహార భద్రతా చట్టం, ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన అనే రెండు పథకాల కింద దిల్లీలో రేషన్ సరకులను కేంద్రం అందిస్తోందని పేర్కొన్నారు.
"రేషన్ డోర్ డెలివరీ పథకం వెనుక కేజ్రీవాల్ రహస్య ప్రణాళిక దాగుంది. గోధుమ పిండి వాటాను ఇంటింటికీ సప్లై చేసేవారు ఎక్కువ లెవీ ఛార్జీలను వసూలు చేస్తారు. పేదల వద్ద నుంచి లెవీ ఛార్జీలు ఇంకా ఎంత ఎక్కువ కావాలో కేజ్రీవాల్ మాట్లాడనేలేదు. ఈ పథకం ద్వారా ఎవరికి రేషన్ అందుతుంది? ఎవరికి రేషన్ అందట్లేదో అస్సలు తెలియదు. ఇది ఓ పెద్ద కుంభకోణం(స్కామ్)" అని సంబిత్ పాత్ర పేర్కొన్నారు.
పిజ్జాలు చేయట్లేదా?
అంతకుముందు.. ఇంటి వద్దకే రేషన్ సరకులను అందించే కార్యక్రమాన్ని కేంద్రం ఎందుకు అడ్డుకుంటోందని అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు. పిజ్జాలు, బర్గర్లు, స్మార్ట్ఫోన్లు, దుస్తులు ఇంటి వద్దకే వచ్చి అందిస్తుండగా.. రేషన్ సరకులు ఎందుకు అందించకూడదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమాన్ని అమలు చేయడానికి తమకు కేంద్రం అనుమతి అవసరం లేదని, అయినా ఎలాంటి వివాదం రాకుండా ఉండేందుకు, కేంద్రానికి అయిదు సార్లు అభ్యర్థించామని స్పష్టం చేశారు. అయినప్పటికీ కేంద్రం అనుమతి కోరలేదనే కారణంతో లెఫ్ట్నెంట్ గవర్నర్ తమ అభ్యర్థనను తిరస్కరించారని పేర్కొన్నారు.
నిందించటమే పనా?
దేశంలో రేషన్ సరకులు చోరీకి గురవుతోంటే కేంద్రం మాత్రం దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను నిందించటానికే చూస్తోందని దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా విమర్శించారు. దేశంలోని 80 కోట్ల లబ్ధిదారులకు చేరాల్సిన ఈ రేషన్ సరఫరా చోరీ వెనక భాజపా హస్తం ఉందని ఆరోపించారు.
ఇదీ చూడండి: 'వ్యవసాయంపై కొవిడ్ 2.0 ప్రభావం ఉండదు'