దీపావళి వచ్చిందంటే మిఠాయిల దుకాణాల వారు రకరకాల మిఠాయిలు అందుబాటులోకి తెస్తుంటారు. ఉత్తర్ప్రదేశ్లోని కాస్గంజ్లో ఓ దుకాణం తయారు చేసిన మిఠాయిని కొనుగోలు చేయాలంటే మాత్రం ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఈ ప్రత్యేక 'కాజూ కలశ్' మిఠాయి కేజీ రూ.20,000. పైన్ గింజలు, కశ్మీర్లో లభించే కిశోరీ పిస్తా, కుంకుమపువ్వు వంటివి తయారీలో ఉపయోగించడం వల్లే అంత ధర. అంతేకాకుండా 24 క్యారెట్ల బంగారాన్ని కూడా ఈ మిఠాయి తయారీలో ఉపయోగించడం విశేషం.


ఈ ప్రత్యేకతల కారణంగానే తాము తయారుచేసిన 'కాజూ కలశ్'కు మిగతా వాటితో పోల్చితే ప్రత్యేక రుచి లభిస్తుందని రోషన్లాల్ స్వీట్స్కు చెందిన రజత్ మహేశ్వరి చెప్పారు. ధర కారణంగా ఈ మిఠాయి అమ్మకాలు పెద్దగా ఉండకపోవచ్చునని, ప్రత్యేకతల కారణంగా కచ్చితంగా కొందరు ఖాతాదారులను ఆకర్షిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
