బంగాల్.. ఇది ఒకప్పటి కామ్రేడ్ల కంచుకోట. అయితే తృణమూల్ కాంగ్రెస్ జోరుతో అధికార పీఠాన్ని కోల్పోయి.. ప్రతిపక్ష హోదాకు కూడా దూరమైంది.
కేరళ.. ప్రస్తుతం వామపక్షాల చేతిలో ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం.
ఈ నెల 27 నుంచి ఓ కేంద్రపాలిత ప్రాంతం, నాలుగు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో.. వామపక్షాలకు బంగాల్, కేరళ రాష్ట్రాలు కీలకం. కేరళలో గెలుపు, బంగాల్లో పోటీ ఇవ్వడం కామ్రేడ్ల ముందున్న ప్రధాన లక్ష్యం.
కొత్త ఉత్సాహం
ఇటీవల జరిగిన బిహార్ ఎన్నికల్లో ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమితో పొత్తులో భాగంగా 19 స్థానాల్లో పోటీ చేసిన వామపక్షాలు.. 12 స్థానాల్లో గెలుపొంది కొత్త ఉత్సాహంతో ఉన్నాయి. ఇదే జోరు బంగాల్లోనూ కొనసాగించాలని తహతహలాడుతున్నాయి.
2016లో కాంగ్రెస్తో కలిసి బంగాల్ బరిలోకి దిగిన వామపక్షాలు చతికిలపడ్డాయి. అయితే ఈసారి ఎనిమిది దశల్లో జరగనున్న బంగాల్ ఎన్నికల్లో మరోసారి అదే పార్టీతో జతకట్టాయి. అయితే బంగాల్లో ఎలా అయిన కాషాయ జెండా పాతాలని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోన్న భాజపాయే తమకు ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తున్నాయి. ఈ మేరకు భాజపాపై గురిపెట్టిన వామపక్షాలు.. టీఎంసీకి ప్రత్యామ్నాయం వామపక్ష-కాంగ్రెస్ లౌకిక ప్రజాస్వామ్య కూటమేనంటూ భారీగా ప్రచారం చేస్తున్నాయి.
కీలకం కానున్న ఐఎస్ఎఫ్
ఈసారి బంగాల్ ఎన్నికల్లో ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్(ఐఎస్ఎఫ్) కీలకం కానుంది. ఇటీవల పిర్జాదా అబ్బాస్ సిద్దికీ స్థాపించిన ఐఎస్ఎఫ్.. టీఎంసీ వ్యతిరేక ముస్లిం ఓట్లలో చీలిక తీసుకురావడం ద్వారా భారీగా లబ్ధి పొందే అవకాశం ఉంది. బంగాల్లో ఇప్పటివరకు ముస్లిం పార్టీలు లేనందున.. 30 శాతం ఉన్న ముస్లింలు గత రెండు దఫాలు టీఎంసీకి అండగా నిలిచారు. అయితే ఈసారి బరిలోకి ఐఎస్ఎఫ్ దిగుతోంది. దీంతో ముస్లిం మైనారిటీ ఓట్లలో చీలిక రావడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు రాజకీయ నిపుణులు. ఫలితంగా 100 నుంచి 110 స్థానాల్లో ఫలితాలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది.
అవసరమైతే అన్ని పార్టీలకు మద్దతు
రాష్ట్రంలో కొన్నిచోట్ల వామపక్షాలు బలహీనపడటం వల్లే భాజపా ప్రధాన పార్టీగా ఎదగడానికి వీలుపడిందని సీపీఐ(ఎంఎల్) ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని మరచి భాజపాను తక్కువ అంచనా వేసినట్లయితే తప్పులో కాలువేసినట్లేనన్నారు. 12 స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్న ఆయన.. భాజపాను ఓడించేందుకు టీఎంసీ సహా ఇతర పార్టీలకు మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.
బంగాల్లో దోస్తీ- కేరళలో కుస్తీ
కేరళలో అధికారంలో ఉన్న సీపీఐ(ఎం) నేతృత్వంలోని ఎల్డీఎఫ్.. మళ్లీ అధికార పీఠాన్ని దక్కించుకుంటుందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ధీమా వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికల ఫలితాలు దీన్ని స్పష్టం చేశాయన్నారు. అయితే బంగాల్లో ఒకే కూటమిగా ఏర్పడిన కాంగ్రెస్-వామపక్షాలు.. కేరళలో ప్రత్యర్థులు కావడం వామపక్షాలకు పెద్ద సవాలుగా మారింది. కేరళలో భాజపా అంత ప్రభావం చూపకపోయినప్పటికీ.. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్.. ఎల్డీఎఫ్ను ఓడించడానికి భాజపాతో కలిసిపోయిందని కామ్రేడ్లు ఆరోపిస్తున్నారు.
కేరళలో పోటాపోటీ..
కామ్రేడ్ల ఆరోపణలకు తగ్గట్లుగానే కేరళలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రచారంలో దూసుకుపోతున్నారు. అధికార ఎల్డీఎఫ్పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇటు బంగాల్లో కలిసి పోటీ చేస్తున్నప్పటికీ వామపక్షాలతో ఒకే వేదికపై కలిసి ప్రచారం చేయడం కేరళలో పార్టీకి చేటు చేస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే బంగాల్లో ప్రచారానికి కాంగ్రెస్ అగ్రనేతలు అంత ప్రాధాన్యం ఇవ్వడం లేదని విశ్లేషకులు అంటున్నారు.
మరి ఇన్ని సవాళ్ల మధ్య కామ్రేడ్లు మళ్లీ ఎర్రజెండాను రెపరెపలాడిస్తారా? లేదా చూడాలి.
ఇదీ చూడండి: దోస్తులతో కలిసి.. కమలం, హస్తం కుస్తీ!