కరోనాతో ఆగిన ఆటో చక్రాన్ని పరుగు పెట్టించేందుకు కంకణం కట్టుకున్నాడు ఆ వ్యక్తి. కేరళలో కరోనా విజృంభిస్తుండడం, మరోవైపు స్థానికంగా విధించిన లాక్డౌన్తో జీవనం గడవని ఆటో డైవర్లకు అండగా నిలుస్తున్నాడు. ఓ వైపు పెట్రోల్ ధరలు పెరుగుతున్నా.. లెక్క చేయక 3 లీటర్ల పెట్రోల్ ఉచితంగా ఇస్తున్నాడు. ఆయనే కేరళ కాసరగోడ్లోని కుడుకోలి పెట్రోల్ పంపు యజమాని అబ్ధుల్లా మాడుమౌలీ.
వృత్తరీత్యా అబుదాబిలో చార్టెడ్ అకౌంటెంట్ అయిన అబ్ధుల్లా.. రోజువారి తన బంకుకు వచ్చే వారిలో ఎక్కువగా ఉండే ఆటోడ్రైవర్లకు సాయం చేయాలని అనుకున్నారు. ఇందుకు తన పెట్రోల్ బంకుకు వచ్చిన వారికి ఉచితంగా పెట్రోల్ ఇవ్వసాగారు. ఇది తెలుసుకున్న చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా ఆ బంకుకు రాసాగారు. దీనిని ఏ మాత్రం పబ్లిసిటీగా ఉపయోగించుకోవడం లేదని బంకును చూసుకునే అబ్ధుల్లా తమ్ముడు సిద్ధిక్ అంటున్నారు. సాయం చేయాలనే లక్ష్యంతోనే ఈ విధంగా చేస్తున్నట్లు చెప్పారు. కార్మిక వర్గం ఇబ్బందులు మాకు తెలుసు అని అంటున్నారు.
పెట్రోదాత సుఖీభవ..
లాక్డౌన్తో ఇబ్బంది పడిన ఆటో డ్రైవర్లు అబ్ధుల్లా, అతని సోదరుడు చేస్తున్న సాయాన్ని కొనియాడుతున్నారు. ధరలు ఆకాశాన్ని అంటుతున్నా.. ఉచితంగా ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నారు. వారి దాతృత్వానికి కృతజ్ఞతలు చెప్తున్నారు.
ఇదీ చూడండి: కులాంతర వివాహం చేసుకుందని గుండు కొట్టారు!