'అరుదైన వ్యాధుల జాతీయ విధానం-2021'కు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ ఆమోదం తెలిపారు. అరుదైన వ్యాధుల చికిత్స వ్యయాన్ని తగ్గించటం, దేశీయ పరిశోధన, స్థానికంగా ఔషధాల ఉత్పత్తిపై దృష్టిసారించే లక్ష్యంగా ఈ పాలసీని రూపొందించారు. ఈ మేరకు ఆరోగ్య శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.
ఒక్కసారి చికిత్స అవసరమైన అరుదైన వ్యాధుల కోసం రాష్ట్రీయ ఆరోగ్య నిధి కింద రూ.20 లక్షల వరకు ఆర్థిక సాయం అందించేలా నియమాలు రూపొందించారు. ముఖ్యంగా అరుదైన వ్యాధుల విధానంలోని గ్రూప్-1 జాబితాలో ఉన్న వ్యాధులకు ఈ సాయం అందిస్తారు.
" ఆర్థిక సాయం పొందే లబ్ధిదారులు కేవలం దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకే పరిమితం కాదు, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనకు అర్హులైన 40 శాతం మందికీ అందనుంది. అరుదైన వ్యాధుల చికిత్సల కోసం అందించే ఆర్థిక సాయం రాష్ట్రీయ ఆరోగ్య నిధి ద్వారా లభిస్తుంది. కానీ, ఆయుష్మాన్ భారత్ కిందకు రాదు. అలాగే.. క్రౌడ్ఫండింగ్ను సైతం ప్రోత్సహిస్తోంది. కార్పొరేట్లు, వ్యక్తిగతంగా.. ఐటీ ప్లాట్ఫాం ద్వారా ఆర్థిక సాయం చేయవచ్చు. ఈ నిధులు మూడు కేటగిరీలుగా తేల్చిన వ్యాధుల కోసం ఖర్చు చేస్తాం. జాతీయ పాలసీకి మార్చి 30న ఆమోదం తెలిపారు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ "
- కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ.
ఈ విధానం ప్రధానంగా ముందస్తుగా వ్యాధులను గుర్తించటం, అరికట్టటంపై దృష్టి సారించనుంది. అందుకోసం ప్రాథమిక, సెకండరీ ఆరోగ్య కేంద్రాలను వినియోగించనున్నారు. బయోటెక్నాలజీ ద్వారా ఏర్పాటు చేసిన నిదాన్ కేంద్రాలు కూడా ఇందుకు సహకరించనున్నాయి. ఆరోగ్య సంసరక్షణ కేంద్రాలను బలోపేతం చేయటం, డయగ్నోస్టిక్స్ సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ఒకేసారి వీటికి రూ.5 కోట్ల వరకు ఆర్థిక సాయం అందించటం ఈ విధాన లక్ష్యం.
అరుదైన వ్యాధుల ముసాయిదా విధానాన్ని 2020, జనవరి 13న ప్రజలకు అందుబాటులో ఉంచింది కేంద్రం. భాగస్వాములు, సాధారణ ప్రజలు, ఆర్గనైజేషన్స్, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి స్పందనలు కోరింది. ముసాయిదా విధానంపై వచ్చిన సలహాలు సూచనలను ఆరోగ్య శాఖ నేతృత్వంలోని నిపుణుల కమిటీ పరిశీలించి తుది విధానాన్ని ఖరారు చేశారు.
ఇదీ చూడండి: ఆటిజం లక్షణాలను ముందే పసిగట్టండి ఇలా..