వ్యవసాయ క్షేత్రంలో విరివిగా వాడే డై అమ్మోనియా ఫాస్పేట్ డీఏపీ ఎరువుల బస్తాపై ఇస్తున్న సబ్సిడీ పెంపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఒక్కో బస్తాపై అదనంగా 700 రూపాయలు సబ్సిడి ఇచ్చేందుకు మంత్రివర్గం అంగీకరించింది. ఈ నిర్ణయంతో ప్రభుత్వ ఖజానాపై 14వేల 775 కోట్ల రూపాయల భారం అదనంగా పడనుంది.
గతేడాది 17వందలు ఉన్న డీఏపీ 50కేజీల బస్తా ధర ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో 2వేల 400కు చేరింది. ఈ నేపథ్యంలో గత నెల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో డీఏపీపై ఇస్తున్న రాయతీని 140 శాతం పెంచాలని నిర్ణయించారు.
ఈ క్రమంలో జరిగిన తాజా కేబినెట్ సమావేశంలో యూరియాపై ఇస్తున్న రాయితీని 500 నుంచి 12వందల రూపాయలకు పెంచేందుకు మంత్రి వర్గం పచ్చా జెండా ఊపింది. ఫలితంగా 2వేల 400 ఉన్న డీఏపీ బస్తా 12వందలకే రైతులకు అందుబాటులోకి రానుంది.
డీప్ ఓషన్ మిషన్కు కేబినెట్ ఆమోదం..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత జరిగిన మంత్రి మండలి సమావేశంలో 'డీప్ ఓషన్ మిషన్'కు ఆమోదం లభించింది. సముద్ర వనరులను సరైన రీతిలో వినియోగించుకోవడానికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. బహుళ సంస్థాగత ప్రతిపాదన కోసం ప్రతిష్ఠాత్మక మిషన్ను మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్కు బదిలీ చేసింది.
ఈ మిషన్ కోసం వచ్చే ఐదేళ్ల కాలంలో రూ. 4,077 కోట్లను ఖర్చు చేయనుంది కేంద్రం. ఈ మిషన్ అమలును దశల వారీగా చేపట్టనున్నారు. మొదటి దశగా వచ్చే మూడేళ్లలో (2021-2024) రూ. 2,823.4 కోట్లును దీనికోసం వెచ్చించనున్నారు. డీప్ ఓషన్ మిషన్ను ప్రభుత్వం బ్లూ ఎకానమీ ఇనిషియేటివ్స్ కింద అభివృద్ధి చేయనుంది. దీనికి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ నోడల్ మంత్రిత్వ శాఖ వ్యవహరించనుంది.
ఈ మిషన్లో ప్రధానంగా ఆరు భాగాలు ఉన్నాయి. సముద్ర వాతావరణ మార్పులను కనిపెట్టి సలహాలు సూచనలు ఇవ్వడం, సముద్ర సంపదను వెలికితీత, సముద్రంలో జీవవైవిధ్యం కాపాడడం, పరిరక్షించడం, సాంకేతిక ఆవిష్కరణలు, లోతైన సముద్ర సర్వే, సముద్రం నుంచి మంచినీటిని వెలికి తీయడం, మెరైన్ స్టేషన్ ఏర్పాటు లాంటివి వీటిలో భాగం కానున్నాయి.
ఇదీ చూడండి: కొవిడ్ వారియర్లకు ప్రత్యేక క్రాష్ కోర్స్