ఓవైపు దేశం కరోనాతో విలవిలలాడుతుంటే.. మరోవైపు బ్లాక్ ఫంగస్ ప్రజలను కలవరపెడుతోంది. దేశ నలుమూలలా బ్లాక్ ఫంగస్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇలా ప్రజలు అన్ని విధాలుగా అల్లాడిపోతున్న నేపథ్యంలో మరో కొత్త వ్యాధి బయటపడింది. అదే వైట్ ఫంగస్. బిహార్ రాజధాని పట్నాలో 4 వైట్ ఫంగస్ కేసులు నమోదవడం అందరినీ భయాందోళనకు గురిచేస్తోంది.
ఏంటీ వైట్ ఫంగస్?
కరోనా లక్షణాలతో.. పట్నాలోని వైద్య కళాశాల ఆసుపత్రిలో ఇటీవలే నలుగురు చేరారు. వారికి పరీక్షలు చేయగా.. కరోనా నెగిటివ్గా తేలింది. దీనిపై అక్కడి వైద్యులు అనుమానం వ్యక్తం చేశారు. విస్తృతంగా పరీక్షించి.. వారికి వైట్ ఫంగస్ సోకిందని నిర్ధరించారు.
వైట్ ఫంగస్ రోగుల్లో ముఖ్యంగా కరోనా లక్షణాలు ఉంటాయి. వాటితో పాటు శరీరంలోని అనేక అవయవాలపై ఈ ఫంగస్ ప్రభావం చూపిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. చర్మం, గోళ్లు, నోటి లోపలి భాగం, కిడ్నీలు, మెదడుపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు.
రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వారు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే బ్లాక్ ఫంగస్ కన్నా ఈ వైట్ ఫంగస్ ప్రమాదకరం కాదని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:- 'బ్లాక్ ఫంగస్ను 'సాంక్రమిక' చట్టం కింద గుర్తించాలి'