సముద్ర గర్భంలో దాగిన అనంతమైన సహజ వనరులను ఒడిసి పట్టుకొని ఆర్థికాభివృద్ధికి ఊతమిచ్చేలా వాటిని వినియోగించుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. అందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధి, వనరుల అన్వేషణ కోసం వచ్చే అయిదేళ్లలో రూ.4,077 కోట్ల వ్యయంతో 'డీప్ ఓషన్ మిషన్' చేపట్టనుంది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(ఈపీసీసీ) ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. తొలి దశ కింద మొదటి మూడేళ్ల (2021-24)లో రూ.2,823.4 కోట్లు ఖర్చు చేస్తారు. ఈ మొత్తం కార్యక్రమాన్ని భూవిజ్ఞాన మంత్రిత్వశాఖ(మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్) పర్యవేక్షిస్తుంది. 7,517 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం, 1,382 ద్వీపాలున్న మన దేశం సాగర గర్భంలోని వనరులను సమర్థంగా ఉపయోగించుకోవాలన్న ఉద్దేశంతో 'డీప్ ఓషన్ మిషన్'కు శ్రీకారం చుట్టింది. ఇందులో మొత్తం ఆరు అంశాలు ఇమిడి ఉంటాయి. అవి..
- డీప్ సీ మైనింగ్ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి: సముద్ర గర్భంలో 6వేల మీటర్ల లోతులో అన్వేషణ చేపట్టడానికి అనువుగా ముగ్గురు మనుషులు ప్రయాణించేందుకు వీలైన జలాంతర్గామి (సబ్మెర్సిబుల్)ని సైంటిఫిక్ సెన్సర్లు, టూల్స్తో అభివృద్ధి చేస్తారు. అమెరికా, రష్యా, ఫ్రాన్స్, జపాన్, చైనా తర్వాత మన దేశానికి మాత్రమే ఈ సాంకేతిక పరిజ్ఞానం ఉంది. మధ్య హిందూ మహాసముద్రంలో 6 కిలో మీటర్ల లోతు నుంచి పాలీ మెటాలిక్ మైనింగ్ నోడ్యుల్స్ను వెలికి తీయడానికి సమీకృత మైనింగ్ వ్యవస్థను అభివృద్ధి చేస్తారు. ఇక్కడ జరిగే అధ్యయనాలు సమీప భవిష్యత్తులో వాణిజ్య అవసరాల కోసం ఖనిజ తవ్వకాలు చేపట్టేందుకు బాటలు వేస్తాయి. సముద్ర గర్భం నుంచి ఖనిజాలు, ఇంధన వనరులను వెతికిపట్టుకోవడం బ్లూ ఎకానమీకి దోహదం చేస్తుంది.
- సముద్ర వాతావరణ మార్పులపై అధ్యయనం: సముద్ర వాతావరణంలో వచ్చే మార్పులను అర్థం చేసుకోవడానికి సముచితమైన విధానాలను అభివృద్ధి చేస్తారు. తద్వారా తాజా పరిస్థితులతో పాటు రాబోయే దశాబ్దాల్లో వచ్చే మార్పులనూ అంచనావేసి అందుకు అనువైన చర్యలు తీసుకుంటారు. ఇది కోస్తా తీరంలో పర్యాటకాభివృద్ధికి, తద్వారా ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుంది.
- జీవ వైవిధ్య రక్షణకు వినూత్న చర్యలు: సముద్రగర్భంలో ఉన్న జీవజాలంపై అధ్యయనం చేస్తారు. అక్కడ ఉండే జీవవైవిధ్యాన్ని పరిరక్షిస్తూనే సముద్ర గర్భంలోని వనరులను వెలికితీయడంపై దృష్టి సారిస్తారు.
- డీప్ ఓషన్ సర్వే: హిందూ మహాసముద్రంలో ఉన్న మధ్య సాగర కనుమల్లో (మిడ్ ఓషనిక్ రిడ్జెస్) నిక్షిప్తమై ఉన్న విలువైన, అరుదైన ఖనిజాలను గుర్తించడం దీని ప్రధాన ఉద్దేశం.
- ఇంధనాలు, తాగునీటి సేకరణ: సముద్ర వనరుల నుంచి ఇంధనం ఉత్పత్తితో పాటు నిర్లవణీకరణ ప్లాంట్లు నెలకొల్పి సముద్ర నీటిని తాగునీటిగా మార్చడంపై దృష్టిసారిస్తారు.
- ప్రత్యేక మెరైన్ కేంద్రాలు: సముద్ర జీవులపై అధ్యయనం కోసం ఆధునిక మెరైన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఇక్కడ చేసే పరిశోధనలు పారిశ్రామిక అవసరాలకు ఉపయోగపడేలా చేయూతనందిస్తారు.
కేబినేట్ ఇతర నిర్ణయాలు..
దేశీయ నౌకా బిల్లు: దేశీయ జల వనరుల్లో రాష్ట్రాల మధ్య జరిగే జల రవాణా, వాణిజ్య కార్యకలాపాలకు ఉద్దేశించిన చట్టాల్లో ఏకరూపత తీసుకురావడం కోసం త్వరలో దేశీయ నౌకా బిల్లు (ఇన్ల్యాండ్ వెసల్ బిల్)ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర సహాయ మంత్రి మాండవీయ తెలిపారు. రాష్ట్రాల మధ్య జల రవాణాకు అవసరమైన అనుమతులు పొందటానికి ఎదురవుతున్న ఇబ్బందులూ తొలగిపోతాయన్నారు. దేశంలో 4వేల కి.మీ. పొడవైన అంతర్ జలమార్గాలున్నాయి.
రూ.1200కే డీఏపీ బస్తా: అంతర్జాతీయంగా డీఏపీ ఎరువుల ధర పెరిగినా ఆ భారాన్ని రైతులపై మోపకూడదని గత నెలలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. గత ఏడాది మాదిరిగానే రైతులకు డీఏపీ (50 కిలోల) బస్తా రూ.1200కే లభించనుంది. ఒక్కో బస్తాపై కేంద్రం గత ఏడాది రూ.500 రాయితీని భరించగా ఇప్పుడు దానికి మరో రూ.700 జత చేసి మొత్తంగా రూ.1200 చొప్పున సబ్సిడీ కల్పించనుంది. అంతర్జాతీయ ధరల ప్రకారం అయితే డీఏపీ బస్తా అసలు ధర రూ.2400గా ఉంది. యూరియా బస్తాపై రూ.900 రాయితీ కల్పిస్తున్నట్లు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. దీనివల్ల ఖజానాపై రూ.14,775 కోట్ల భారం పడుతుందని మంత్రి వెల్లడించారు.
ఎరువుల రాయితీల నిర్ధరణ
ప్రధాని మోదీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఫాస్పెటిక్, పొటాసిక్ (పీ అండ్ కే) రకం ఎరువులకు పోషకాధారిత రాయితీ రేట్లను నిర్ధరించింది. 2021-22 కాలానికి ఈ కొత్త ధరలు వర్తిస్తాయి. తాజా నిర్ణయం ప్రకారం.. కిలో నైట్రోజన్ (ఎన్) ఎరువుకు రూ.18.789, ఫాస్పరస్(పి)కు రూ.45.323, పొటాష్(కె)కు రూ.10.116, కిలో సల్ఫర్ (ఎస్) ఎరువుకి రూ.2.374 చొప్పున రాయితీగా అందిస్తారు.
ఇవీ చదవండి: 2024 ఎన్నికలే లక్ష్యం- రంగంలోకి మోదీ