ఈసారి బడ్జెట్ సమావేశాలు అత్యంత ఫలప్రదంగా సాగాయని వ్యాఖ్యానించారు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి. అఖిల పక్షాల సహకారంతోనే ఇది సాధ్యమైందన్నారు. ఉభయసభలు 18 బిల్లులకు ఆమోదం తెలిపాయని పేర్కొన్నారు. గురువారంతో పార్లమెంట్ సమావేశాలు ముగిసిన నేపథ్యంలో జోషి ఈ వ్యాఖ్యలు చేశారు.
"బడ్జెట్ సమావేశాల్లో మెరుగైన ఫలితాలు కనిపించాయి. ఈ సమావేశాలు షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 8 వరకు కొనసాగాల్సి ఉంది. కానీ పలు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వీలుగా.. సమావేశాలను ముందుగానే ముగించాలని వివిధ పార్టీలకు చెందిన నేతలు విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తి మేరకు గురువారంతో సమావేశాలు ముగిశాయి."
-ప్రహ్లాద్ జోషి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి
మొత్తంగా లోక్సభలో 24 సమావేశాలు, రాజ్యసభలో 23 సమావేశాలు జరిగాయని జోషి వెల్లడించారు. ఈసారి మొత్తం 20 బిల్లులు (17 లోక్సభలో, 3 రాజ్యసభలో) ప్రవేశపెట్టామని స్పష్టం చేశారు. లోక్సభలో 18 బిల్లులు, రాజ్యసభలో 19 బిల్లులు ఆమోదం పొందాయన్నారు.
ఇదీ చదవండి : 'ఎన్నికల సంఘం విధుల్లో భాజపా జోక్యం'