భాజపా స్టార్ క్యాంపెయినర్లు, అలనాటి హీరోయిన్లు ఖుష్బూ సుందర్, గౌతమిలకు కాలం కలిసిరావడంలేదు. 1980లలో తమిళ సినీ పరిశ్రమను ఊపుఊపిన వీరు రాజకీయాల్లో ఇప్పుడిప్పుడే పాఠాలు నేర్చుకుంటున్నారు. ఏప్రిల్ 6న జరిగే ఎన్నికల ద్వారా తమిళనాడు అసెంబ్లీలో అడుగుపెట్టాలని భావించిన వీరి ఆశలు అడియాసలయ్యేలా ఉన్నాయి.
![BJP star campaigners left fuming after seat sharing finalized in AIADMK](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10990206_wh.jpg)
రాజపాలయంలో గౌతమి, చెపాక్-ట్రిప్లికేన్ నియోజక వర్గంలో ఖుష్బూ నాలుగు నెలలుగా శాసనపోరు కోసం ప్రచారం చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాలకు భాజపా ముఖచిత్రాలుగా మారారు.
అయితే ఏఐఏడీఎంకే సహా ఇతర కూటమి పార్టీలు ఇటీవల చేసుకున్న సీట్ల సర్దుబాటుతో వారి శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరులా మారింది. కూటమిలో అతిపెద్ద పార్టీ ఏఐఏడీఎంకే.. భాజపాకు ఆ రెండు నియోజకవర్గాలను కేటాయించలేదు. ఏఐఏడీఎంకే నేతృత్వంలోని ఈ కూటమిలో పీఎంకే, భాజపాతో పాటు ఇతర పార్టీలున్నాయి.
![BJP star campaigners left fuming after seat sharing finalized in AIADMK](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10990206_5.jpg)
తమిళనాడులోని 234 అసెంబ్లీ స్థానాల్లో ఏఐఏడీఎంకే 177 స్థానాల్లో పోటీ చేయనుంది. భాజపా 20, పీఎంకే 23 చోట్ల నుంచి బరిలో నిలవనున్నాయి. ఈ ఒప్పందంతో ఆశ్చర్యపోవడం ఖుష్బూ, గౌతమిల వంతైంది.
2011లో శివకాశి నుంచి పోటీ చేసిన ప్రస్తుత మంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ.. ఈ ఎన్నికల్లో రాజపాలయం నుంచి పోటీ చేయనున్నారు. చెపాక్-ట్రిప్లికేన్ నుంచి పీఎంకేకు చెందిన ఏవీఏ కస్సలి బరిలో నిలుస్తున్నారు.
![BJP star campaigners left fuming after seat sharing finalized in AIADMK](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10990206_4.jpg)
ఖుష్బూ శ్రమ వృథా?
కొన్ని నెలల క్రితం కాంగ్రెస్ను వీడి కాషాయ కండువా కప్పుకొన్న ఖుష్బూను చెపాక్ నియోజక వర్గానికి ఇన్ఛార్జ్గా నియమించింది భాజపా. ఈ నియోజకవర్గం నుంచే అసెంబ్లీకి వెళ్తానని ఆశించి.. దాదాపు మూడు నెలలు తీవ్రంగా కృషిచేశారామె. పార్టీ సమావేశాలకు హాజరవడమే కాక ఇంటింటికీ తిరిగి ఓటర్లను కలిశారు. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఆ స్థానం నుంచే గతంలో మూడు సార్లు గెలుపొందారు.
![BJP star campaigners left fuming after seat sharing finalized in AIADMK](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10990206_6.jpg)
1977 నుంచి డీఎంకేకు చెపాక్ కంచుకోటలా ఉంది. దానికి చరమగీతం పాడాలని ఖుష్బూ భీష్మించుకున్నారు. వారసత్వ పాలనను అంతమొందించాలని తన ప్రచారంలో పిలునిచ్చారు.
వ్యర్థమైన గౌతమి పోరు?
గౌతిమి కూడా రాజపాలయం నుంచి పోటీ చేస్తానని భావించి అక్కడి ప్రజలను తరచూ కలిసేవారు. దాదాపు 5 నెలలుగా ఆ నియోజకవర్గంలో సమావేశాలు నిర్వహించి డీఎంకేపై విమర్శల దాడి చేశారు. దీంతో గౌతమికి అక్కడ మంచి ఆదరణ లభించింది.
![BJP star campaigners left fuming after seat sharing finalized in AIADMK](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10990206_3.jpg)
అయితే ఈ రెండు నియోజకవర్గాలను ఇప్పుడు ఇతర పార్టీలకు కేటాయించడం వల్ల వీరికి నిరాశే మిగిలింది. కాగా, ఈ 5 నెలలు తనపై ప్రేమ, ఆదరణ చూపిన రాజపాలయం నియోజకవర్గ ప్రజలకు గౌతమి కృతజ్ఞతలు తెలిపారు.
![BJP star campaigners left fuming after seat sharing finalized in AIADMK](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10990206_2.jpg)
"నన్ను మీ కుటుంబంలో ఒకరిగా భావించి గత 5 నెలలు సేవ చేసే అవకాశమిచ్చారు. మీ ప్రేమాభిమానాలకు రుణపడి ఉంటాను. ప్రేమతో చిగురించిన మన బంధం చిరకాలం ఉంటుందని ఆశిస్తున్నా. మీ అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడతా."
-గౌతమి, భాజపా నేత
మరో నేత ఖుష్బూ కూడా 3 నెలల ప్రచార కాలంలో తన వెన్నంటే నిలిచిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. తాను అభ్యర్థినని ఎప్పుడూ చెప్పలేదని గుర్తుచేశారు.
![BJP star campaigners left fuming after seat sharing finalized in AIADMK](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10990206_7.jpg)
"ఎక్కడికెళ్లినా ప్రజలు నాపై ప్రేమ చూపించారు. ఆశీస్సులు అందజేశారు. దీవించారు. నేను వారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటా. వారి జీవితాలను మెరుగుపరిచి వారిని సంతోషపెట్టడం నా బాధ్యత. దానికి కట్టుబడి ఉన్నా. నిజమైన సైనికుడు ఏమీ ఆశించడు. నేనూ అలాగే చెపాక్-ట్రిప్లికేన్లో క్షేత్రస్థాయిలో తీవ్రంగా కష్టపడ్డా. ఇక్కడి ప్రజలతో నా సంబంధం విడదీయరానిది. నేను ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ని. అభ్యర్థినని ఎప్పుడూ చెప్పలేదు. గత మూడు నెలలు ఎంతో ఆనందాన్నిచ్చాయి. చాలా నేర్చుకున్నా. భాజపా మంచి పథకాలను, విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పనిచేస్తా. క్షేత్రస్థాయిలో పనిచేసే అవకాశం నాకు మరే పార్టీ ఇవ్వలేదు."
-ఖుష్బూ సుందర్, భాజపా నేత
కూటమి ధర్మం కాదు..
అయితే సీట్ల సర్దుబాటుకు 5 నెలల ముందే ప్రచారాన్ని ప్రారంభించడాన్ని రాజకీయ పండితులు తప్పుబడుతున్నారు. అది కూటమి ధర్మం కాదని విమర్మించారు.
![BJP star campaigners left fuming after seat sharing finalized in AIADMK](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10990206_1.jpg)
ఒక పార్టీ కోసం కాకుండా కూటమి పార్టీల తరఫున ప్రచారం చేయాల్సిందని రాజకీయ విశ్లేషకులు చెప్పారు. ఈ నియోజక వర్గాల్లో పోటీచేయని పార్టీ కోసం వారు ఎలా ప్రచారం చేస్తారని మండిపడ్డారు. ఈ 5 నెలల కాలంలో వారు కరపత్రాలు పంచి.. గోడల మీద భాజపా గుర్తులు వేయించారు.
దీంతో ఏఐఏడీఎంకే, పీఎంకే తమ సందేశాన్ని ప్రజల్లోకి పంపడం కష్టతరంగా మారుతుందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఇదంతా ప్రజల్లో గందరగోళం సృష్టిస్తుందని తెలిపారు.
ఇదీ చూడండి: 'అన్నాడీఎంకే.. మోదీకి బానిసగా మారింది'
ఇదీ చూడండి: ప్రజా 'పరీక్ష'లో పళనిస్వామి పాస్ అయ్యేనా?
ఇదీ చూడండి: 75శాతం ఉద్యోగాలు స్థానికులకే.. డీఎంకే మేనిఫెస్టో