గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రజలను ఆకర్షించేందుకు అభ్యర్థులు ప్రచారంలో సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. ఖేడా జిల్లాలోని నడియాద్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న భాజపా అభ్యర్థి పంకజ్భాయ్ దేశాయ్.. ఎన్నికల ప్రచారంలో వినూత్నంగా డిజిటల్ రోబోను ఉపయోగిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కలలుగన్న డిజిటల్ ఇండియాను సాకారం చేసేందుకు ఈ మార్గం ఎంచుకున్నారు పంకజ్. డిజిటల్ రోబోతో భాజపా అభ్యర్థి చేస్తున్న ప్రచారం చూసి నియోజకవర్గ ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.
నడియాద్ అసెంబ్లీ స్థానం నుంచి పంకజ్భాయ్ దేశాయ్ ఆరోసారి పోటీ చేస్తున్నారు. ఈసారి ప్రచారానికి ఆధునిక పద్ధతులను అవలంబించాలని నిర్ణయించుకున్నారు. ప్రచారం కోసం వెరైటీగా ఓ రోబోను తయారు చేయించారు. వివిధ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేసే కరపత్రాలను రోబోతో పంపిణీ చేయిస్తున్నారు. పంకజ్భాయ్ చేస్తున్న రోబోటిక్ ప్రచారం నియోజకవర్గంలో బాగా ప్రాచుర్యం పొందింది.
![bjp technology to win elections bjp candidate in nadiad campaigned by robot](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16962800_nadiyad_1811newsroom_1668753736_276.jpeg)
2017 అసెంబ్లీ, 2019 లోక్సభ ఎన్నికల ప్రచారంలో సాంకేతికత వినియోగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముందంజలో ఉన్నారు. అప్పట్లో ప్రచారానికి డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించారు. ఇప్పుడు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి అదే సాంకేతికతను ఉపయోగిస్తున్నారు భాజపా నేతలు.