ఉత్తర్ప్రదేశ్లో సాహస కృత్యాలతో దుర్గామాతను ఆరాధించారు భక్తులు. జౌన్పుర్ జిల్లా సిర్కోని ప్రాంతం బదల్పుర్లో రోమాలు నిక్కబొడుచుకునే రీతిలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. హోమగుండంలో తల పెట్టి.. వేడిపాలలో చేతులుంచుతున్నారు. అయితే ఈ కార్యక్రమం ద్వారా ఎలాంటి ప్రమాదం జరగలేదని సమాచారం. ఈ సంప్రదాయం శ్రీకృష్ణుడి కాలం నుంచి కొనసాగుతుందని స్థానికులు చెబుతున్నారు. ఒళ్లు గగుర్పొడిచే ఈ పూజను చూడటానికి భక్తులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు.
ఇదీ నేపథ్యం
యదువంశ సంప్రదాయ ప్రకారం దుర్గామాతను కొలిచేందుకు ప్రత్యేక పూజా పద్ధతిని అనుసరిస్తారు ఇక్కడి ప్రజలు. ఈ పూజలో భాగంగా మట్టికుండలో వేడిపాలను మరిగిస్తారు. పొంగిన పాలు వేడిగా ఉండగానే చెయ్యి పెడతారు. మండుతున్న హోమగుండంలో ఏ మాత్రం అలోచించకుండా తలపెట్టేస్తారు. ఇలా చేస్తే దుర్గమ్మ సంతోష పడుతుందనేది వారి నమ్మకం.
ఈ సందర్భంగా ఇద్దరు చిన్నారులు పొంగిన పాలలో చేతులను ఉంచారు. అయితే పాలు చల్లగానే ఉన్నాయని ఆ బాలురు చెప్పారు.
"మేం పొంగిన పాలలో చేతులు ఉంచితే అవి మాకు చల్లగా తగిలాయి."
-పాలలో చేతులుంచిన బాలుడు
పొంగిన పాలలో చేతులు ఉంచడం, హోమగుండంలో తలపెట్టడం యాదవుల ప్రాచీన సంప్రదాయమని చెప్పారు పూజారి పప్పు భగత్ సురహుపూర్. ఇది దుర్గామాతకు ఇష్టమైన పూజావిధానమని స్పష్టం చేశారు. అపాయకరమైన పూజా విధానాలు పాటించినప్పటికీ దుర్గామాత కటాక్షం వల్ల ఎటువంటి ప్రమాదం జరగదన్నారు.
"యాదవ వంశంలో దుర్గామాత పూజ అతి ప్రాముఖ్యమైనది. దీనిని భగవాన్ శ్రీకృష్ణుడు కూడా నాడు చేశారు. ఈ పూజను గోవర్ధన పూజగా వ్యవహరిస్తారు. నేడు మేం నిర్వర్తిస్తున్నాం. యాదవ వంశం, లోక కల్యాణం కోసం ఈ ప్రత్యేక పూజను చేశాం."
- పప్పు భగత్, పూజారి
ఇదీ చూడండి: 48 ఏళ్ల క్రితం విడిపోయిన కుటుంబాన్ని కలిపిన 'ఫేస్బుక్'