మసూద్ అజార్ను ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి 'అంతర్జాతీయ తీవ్రవాది'గా గుర్తించటం సంతోషించదగిన విషయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని రూపుమాపటంలో భారత్కు ఇది భారీ దౌత్య విజయమని కొనియాడారు. ప్రపంచ వేదికపై భారత్ ప్రయత్నాలు ఫలించాయని రాజస్థాన్ జయపురలో నిర్వహించిన ఎన్నికల ప్రసంగంలో తెలిపారు ప్రధాని.
గత ప్రభుత్వ హయాంలో కనీసం ప్రధాని గొంతు వినబడని పరిస్థితులు ఉన్నాయని కాంగ్రెస్పై విమర్శలు చేశారు. కానీ ఇప్పుడు 130 కోట్ల మంది ప్రజల గొంతుక ఐరాస వేదికపై వినిపించిందన్నారు. ఇది ఆరంభం మాత్రమేనని మున్ముందు మరిన్ని జరుగుతాయని చెప్పారు.
" ఐక్యరాజ్య సమితి మసూద్ అజార్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించటం సంతోషించదగిన విషయం. ఆలస్యమైనా మంచే జరిగింది. తీవ్రవాదంపై పోరులో, ఉగ్రవాదాన్ని రూపుమాపటంలో చాలా కాలం నుంచి భారత్ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఇది దేశానికి అతిపెద్ద దౌత్య విజయం."
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
తీవ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేస్తోన్న పోరాటానికి మద్దతుగా నిలిచిన దేశాలకు కృతజ్ఞతలు తెలిపారు ప్రధాని.
ఇటార్సీ సభలో కాంగ్రెస్పై విమర్శలు...
మధ్యప్రదేశ్ ఇటార్సీ ఎన్నికల ర్యాలీలో కాంగ్రెస్పై నిప్పులు చెరిగారు ప్రధాని మోదీ. వంశపారంపర్య పాలన, అవినీతిని వ్యాప్తి చేయటంలోనే హస్తం పార్టీ నేతలు నిజాయతీగా ఉన్నారని ఆరోపించారు. అభివృద్ధి పథకాలను నాశనం చేయటమే కాంగ్రెస్ సంస్కృతి అని ఎద్దేవా చేశారు.
మధ్యప్రదేశ్లో అధికార కాంగ్రెస్ పార్టీ నీటిపారుదల పథకాలను వేగవంతం చేయకపోవటం వల్లనే రాష్ట్రంలో నీటి కొరత వచ్చిందని ఆరోపించారు మోదీ. భాజపా దేశాభివృద్ధికి పాటుపడుతుంటే కాంగ్రెస్ మాత్రం వారి వంశంలోని కొత్త తరం సంక్షేమానికి కృషిచేస్తోందని ఆరోపించారు.
" కాంగ్రెస్ పార్టీ నేతలు మీ మోదీపై ద్వేషాన్ని పెంచుకున్నారు. వారు మోదీని చంపాలని కూడా కలలు కంటున్నారు. కానీ మధ్యప్రదేశ్ ప్రజలు, భారత ప్రజలు మోదీ కోసం పోరాటం చేస్తారని వారు మరిచిపోతున్నారు."
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
ఇదీ చూడండి: అజార్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన ఐరాస