ఇప్పటి వరకు యూకే స్ట్రెయిన్ రకం కేసులను 19 గుర్తించినట్లు జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రయోగశాల ప్రకటించింది. ఈ కొత్త రకం వైరస్ కట్టడికి కేంద్రం తీసుకుంటున్న చర్యలు తదితర వివరాలను.. సంబంధిత అధికారులు ఈటీవీ భారత్కు వెల్లడించారు.
బ్రిటన్లో కొత్త రకం వైరస్ వెలుగు చూడగానే ప్రభుత్వం అప్రమత్తమైంది. బాధితులతో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించడానికి సిద్ధమైంది. యూకే నుంచి తిరిగి వచ్చిన ఆరుగురిలో ఈ కొత్త వైరస్ను కనుగొన్నారు. వాటిలో మూడు బెంగుళూరు, రెండు హైదరాబాద్, మరొకటి పూణెలో గుర్తించారు. వారిని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఐసోలేషన్లో ఉంచాయి.
- కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
నవంబర్ 25 నుంచి డిసెంబర్ 23 వరకు దాదాపు 33వేల మంది ప్రయాణికులు బ్రిటన్ నుంచి భారత్లోని వివిధ ప్రాంతాలకు వచ్చినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వీరందరిని కనుగొని.. వారికి ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహించామని పేర్కొంది. ఇప్పటి వరకు 114 మందికి కరోనా సోకినట్లు గుర్తించినట్లు స్పష్టం చేసింది. వీరి శాంపిళ్లను సార్స్ కోవ్-2 వైరస్ను గుర్తించే ప్రయోగశాలలకు పంపినట్లు తెలిపింది.
తాజా పరిస్థితులను భారత ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని ఐసీఎంఆర్ సలహాదారు డా.సునీలా గార్గ్.. ఈటీవీ భారత్కు తెలిపారు.
కొత్త తరహా కేసుల గుర్తింపునకు ప్రయత్నిస్తున్నాం. సార్స్ కోవ్-2 వైరస్లో ఇప్పటి వరకు 23 ఉత్పరివర్తనలు జరిగాయి. ప్రస్తుతం విజృంభిస్తున్న వైరస్ 'ఎన్501వై' గా యూకే గుర్తించింది. బ్రిటన్ నుంచి వచ్చిన చాలా మంది ఇళ్లకు వెళ్లిపోయారు. దీని వ్యాప్తి మునుపటి వైరస్ కంటే 70 శాతం ఎక్కువగా ఉంది. డెన్మార్క్, నెదర్లాండ్, ఆస్ట్రేలియా, ఇటలీ, స్వీడన్, ఫ్రాన్స్, స్పెయిన్, స్విట్జర్లాండ్, జర్మనీ, కెనడా, జపాన్, లెబనాన్, సింగపూర్లలో ఇప్పటికే కొత్త రకం వైరస్ను కనుగొన్నట్లు నివేదికలు వచ్చాయి.
- డా.సునీలా గార్గ్, ఐసీఎంఆర్ సలహాదారురాలు.
ప్రస్తుత పరిస్థితుల్లో యూకే నుంచి అన్ని విమాన సర్వీసులను డిసెంబర్ 31 వరకు రద్దు చేసింది భారత ప్రభుత్వం.
ఇదీ చదవండి: 'టీకాతో కొత్త స్ట్రెయిన్ నుంచీ రక్ష'