ఝార్ఖండ్ అసెంబ్లీకి నేడు నాలుగో విడత పోలింగ్ జరగనుంది. 15 సీట్లకు జరుగుతున్న ఎన్నికలో 221 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో 23 మంది మహిళలు. 47, 85,009 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 22, 44, 134 మంది మహిళలు సహా 81 ఇతరులు తమ మద్దతును ఓటు రూపంలో వ్యక్తం చేయనున్నారు. 25 మంది బరిలో నిలిచిన బొకారో స్థానం నాలుగో విడతలో ఎక్కువమంది పోటీలో ఉన్న నియోజకవర్గంగా రికార్డుల్లో నిలిచింది.
ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అయితే భద్రతా కారణాలతో జమువా, బగోడర్, గిరిధ్, దుమ్రి, తుండి స్థానాల్లో 3 గంటల వరకు మాత్రమే ఓటుహక్కు వినియోగించుకునేందుకు అవకాశం ఉంది.
మొత్తం 6101 పోలింగ్ స్టేషన్లలో ఓటింగ్ జరగనుండగా.. 4296 పోలింగ్ కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి.
అధికార భాజపా 15 స్థానాల్లో పోటీ చేస్తుండగా విపక్ష పార్టీల కూటమి పొత్తు ఒప్పందం మేరకు ఆయా సీట్లలో బరిలో నిలిచింది.
కట్టుదిట్టమైన భద్రత
పోలింగ్ కేంద్రాలు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో నెలకొని ఉన్న నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 70 పోలింగ్ కేంద్రాల్లో పూర్తిగా మహిళా భద్రతా సిబ్బందిని వినియోగిస్తున్నారు.
తేలనున్న ఇద్దరు మంత్రుల భవితవ్యం
ఝార్ఖండ్ కార్మికశాఖ మంత్రి రాజ్ పాలివార్, రెవెన్యూ శాఖ మంత్రి అమర్కుమార్ బౌరీ నాలుగో దశ పోలింగ్లో బరిలో నిలిచారు. మధుపుర్ స్థానం నుంచి పోటీ చేస్తున్న పాలివార్ జేఎంఎం అభ్యర్థి హుస్సేన్ అన్సారీ నుంచి గట్టిపోటీ ఎదుర్కొంటున్నారు. అమర్కుమార్ బౌరీ ఎన్డీఏ పక్ష పార్టీ ఏజేఎస్యూ ఉమాకాంత్ రజాక్తో తలపడుతున్నారు.
జరియా ఎన్నికపైనా రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళా అభ్యర్థులు జరియా నియోజకవర్గం నుంచి బరిలో నిలిచారు. భాజపా నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే సంజీవ్ సింగ్ సతీమణి రజిని సింగ్ పోటీ చేస్తుండగా కాంగ్రెస్ నుంచి దివంగత నీరజ్ సింగ్ సతీమణి పూర్ణిమ బరిలో నిలిచారు. నీరజ్సింగ్ హత్య కేసులో ఆరోపణలతో ఎమ్మెల్యే సంజీవ్ సింగ్ ప్రస్తుతం జైల్లో ఉన్నారు.
మొత్తం 81 సీట్లున్న అసెంబ్లీలో మొదటి మూడు విడతల్లో 50 స్థానాలకు పోలింగ్ ముగిసింది. నాలుగో విడత ఎన్నికలో 15 సీట్లకు ఎన్నికలు పూర్తవుతాయి. డిసెంబర్ 20న చివరి దశ పోలింగ్ 16 సీట్లకు జరగనుంది. ఫలితాలు ఈ నెల 23న వెలువడతాయి.
ఇదీ చూడండి: 'ఉరితీసే అవకాశమివ్వండి..' రక్తంతో క్రీడాకారిణి లేఖ