కశ్మీర్లో నిర్బంధ ఉత్తర్వుల్ని సమీక్షించాలని సుప్రీం ఆదేశం
జమ్ముకశ్మీర్లో ఆంక్షలను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. నిర్బంధ ఉత్తర్వుల్ని సమీక్షించాలని జమ్మూ పాలనావ్యవస్థకు ఆదేశాలు జారీ చేసింది. వారంలోగా ఈ ప్రక్రియ పూర్తవ్వాలని స్పష్టం చేసింది. ఇంటర్నెట్ సేవలను శాశ్వతంగా నిలిపేసేందుకు అనుమతివ్వని పేర్కొంది సర్వోన్నత న్యాయస్థానం.
జమ్ముకశ్మీర్లో ఆంక్షలను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. కశ్మీర్లో నిషేధాజ్ఞలపై వారంలోగా సమీక్షించాలని జమ్మూ పాలనావ్యవస్థకు ఆదేశాలు జారీ చేసింది. వ్యాజ్యాలపై అన్ని పక్షాల వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం గతేడాది నవంబర్ 27న తీర్పును ఈ రోజుకు వాయిదా వేసింది.
తీర్పు సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది సర్వోన్నత న్యాయస్థానం. ఇంటర్నెట్ కూడా వాక్ స్వేచ్ఛకు మార్గమని పేర్కొన్న సుప్రీం... అంతర్జాల సేవలను శాశ్వతంగా నిలిపివేసేందుకు అనుమతించమని స్పష్టం చేసింది. సేవల నిలిపివేత ఉత్తర్వులు న్యాయ సమీక్షకు లోబడి ఉండాలని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. విద్యాసంస్థలు, ఆసుపత్రులు వంటి అవసరమైన ప్రదేశాల్లో అంతర్జాల సేవలను పునరుద్ధరించాలని సుప్రీం ఆదేశించింది.
మానవ హక్కులు, స్వేచ్ఛ సమతుల్యం అయ్యేలా చూడటమే తమ పని అని పేర్కొంది.
''కశ్మీర్ ఎన్నో దాడులను ఎదుర్కొంది. ప్రజల స్వేచ్ఛ, మానవ హక్కుల పరిరక్షణపై భద్రతా అంశాలను పరిశీలించాం. ఇంటర్నెట్ ప్రాముఖ్యతను తక్కువ అంచనా వేయలేం. ఇటీవలి కాలంలో భావప్రకటనకు అంతర్జాలం ఓ సాధనంగా మారింది. మా ఆదేశాలపై వచ్చే రాజకీయ ఉద్దేశాలను పట్టించుకోం.''
- కశ్మీర్ ఆంక్షలపై తీర్పు సందర్భంగా సుప్రీం కోర్టు
ఆర్టికల్-370 రద్దు తర్వాత కశ్మీర్లో విధించిన ఆంక్షలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్, కశ్మీర్ టైమ్స్ ఎడిటర్ సహా పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీం ఇవాళ నిర్ణయం ప్రకటించింది.