విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు మే 7న 'వందే భారత్ విషన్'ను ప్రారంభించింది కేంద్రం. ఇప్పుడు రెండో విడతను మే 16నుంచి ప్రారంభించనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
ఏఏ దేశాల నుంచి?
వందే భారత్ మిషన్-2లో భాగంగా 31 దేశాల్లోని భారతీయులను స్వదేశానికి తీసుకురానుంది కేంద్రం. అమెరికా, కెనడా, ఒమన్, కజకిస్థాన్, ఉక్రెయిన్, ఫ్రాన్స్, తజికిస్థాన్, సింగపూర్, సౌదీ అరేబియా, ఇండోనేసియా, ఖతార్, రష్యా, కిర్జిస్థాన్, జపాన్, కువైట్, ఇటలీ, నేపాల్, నైజీరియా, బెలారస్, అర్మేనియా, థాయ్లాండ్, ఐర్లాండ్, జర్మనీ, జార్జియా, బ్రిటన్ సహా ఇతర దేశాల నుంచి భారతీయులను తీసుకురానుంది.
ఎన్ని విమానాలు?
మొత్తం 149 విమానాల్లో భారతీయులను స్వదేశానికి తరలించనున్నారు అధికారులు. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఎక్స్ప్రెస్ సేవలను వినియోగించుకోనున్నారు.
ఎన్ని రోజులు?
మే 16 నుంచి వారం రోజుల పాటు(మే 22వరకు) వందే భారత్ మిషన్-2ను నిర్వహించనున్నారు.
ఎవరికి ప్రాధాన్యం?
విదేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్మికులు, గర్భిణిలు, వీసా గడువు ముగిసిన వారు, విద్యార్థులు, ఆరోగ్య సమస్యలున్నవారు, వృద్ధులకు ప్రాధాన్యం.
వందే భారత్ మిషన్-1లో ఎంత మంది?
12 దేశాల నుంచి 64 విమానాల ద్వారా 15వేల మంది భారతీయులను తీసుకురావాలని భావించింది కేంద్రం. గల్ఫ్ దేశాలు సహా, అమెరికా, బ్రిటన్, బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్, మలేషియా, మాల్దీవుల నుంచి 6,527మందిని విషన్-1లో స్వేదేశానికి తరలించింది.
విదేశాల నుంచి భారత్ వచ్చేందుకు దరఖాస్తు చేసుకున్న వారిలో మొత్తం 68,000 మందికి అర్హత ఉన్నట్లు గతవారం తెలిపింది కేంద్రం.