దేశంలో కరోనా మహమ్మారి సంక్రమణపై కీలక విషయాలు వెల్లడించారు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్కు చెందిన శాస్త్రవేత్తలు. అధిక ఆదాయ దేశాలతో పోలిస్తే భారత్లో 40-69 ఏళ్ల మధ్య వయసు వారిలోనే కేసులు, మరణాలు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. ఈ తాజా పరిశోధన జర్నల్ సైన్స్లో ప్రచురితమైంది. రెండు రాష్ట్రాల్లోని వేల మంది కాంటాక్ట్ ట్రేసర్స్ నుంచి సేకరించిన సమాచారం మేరకు 5,75,071 మందిలో వ్యాధి సంక్రమణపై అంచనా వేశారు.
ఈ పరిశోధన.. భారీగా కేసులు నమోదైన తక్కువ, మధ్యాదాయ దేశాల్లో మహమ్మారి వ్యాప్తిపై పరిశీలన చేసేందుకు ఉపయోగపడుతుందన్నారు దిల్లీలోని సెంటర్ ఫర్ డిసీజ్ డైనమిక్స్, ఎకనామిక్స్, పాలసీకి చెందిన శాస్త్రవేత్త రమణన్ లక్ష్మీనారాయణ.
"భారత్లోని రెండు రాష్ట్రాల్లో కేసులు, మరణాలు యువతలోనే అధికంగా ఉన్నట్లు తేలింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో కాంటాక్ట్ ట్రేసింగ్ల కోసం వందలాది మంది ఆరోగ్య కార్యకర్తలు పాల్గొనటం వల్ల ఈ పరిశోధన సాధ్యమైంది. వ్యాధి వ్యాప్తి, మరణాలపై ఫలితాలు.. కొవిడ్-19 కట్టడికి అనుసరించాల్సిన విధానాన్ని తెలియజేసే అవకాశం ఉంది. ఇది భారత పరిశోధనల సామర్థ్యాన్ని ప్రపంచానికి తెలుపుతుంది. "
- రామణన్ లక్ష్మీనారాయణ, శాస్త్రవేత్త
అధిక ఆదాయ దేశాల కన్నా భారత్లోనే ఒక వయసు వారిలోనే వైరస్ సంక్రమణ ముప్పు అధికంగా ఉందని అధ్యయనం తేల్చింది. శాస్త్రవేత్తలు పేర్కొన్న సంక్రమణ నమూనా.. 0-14 ఏళ్ల వయసుతో పాటు 65 ఏళ్లు పైబడిన వారిలో బలంగా ఉన్నట్లు వెల్లడించింది. కేసులు, మరణాల మధ్య నిష్పత్తి సీఎఫ్ఆర్.. 5-17 ఏళ్ల వయసులో 0.05 శాతంగా ఉండగా, అది 85 ఏళ్లు పైబడిన వారిలో 16.6 శాతంగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. రెండు రాష్ట్రాల్లోని రోగులు మరణానికి ముందు సగటున 5 రోజులు ఆసుపత్రిలో ఉండగా.. అది అమెరికాలో 13 రోజులుగా ఉన్నట్లు పరిశోధకులు పేర్కొన్నారు.
ఇతర వ్యాధులతోనే..
మరణించిన వారిలో 63 శాతం మందిలో కనీసం ఒక ఇతర వ్యాధి ఉందని, 36 మందిలో రెండు అంతకన్నా ఎక్కువ ఇతర రోగాలు ఉన్నాయని గుర్తించారు. అందులో 45 మంది డయాబెటిక్ రోగులే ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. అధిక ఆదాయ దేశాలలో మాదిరిగా కాకుండా భారత్లో మరణాలు అధికంగా 50-64 ఏళ్ల మధ్య వయసు వారిలోనే ఉన్నట్లు తేల్చారు.
ఇదీ చూడండి: చౌకైన ఎంజైముతో కరోనా చికిత్స