దేశంలోని వివిధ ప్రాంతాల్లో తనపై నమోదైన ఎఫ్ఐఆర్లను సవాల్ చేస్తూ ప్రముఖ జర్నలిస్టు అర్ణబ్ గోస్వామి దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు శుక్రవారం విచారించనుంది. జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ ఎం.ఆర్.షాల ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్ను నేటి ఉదయం 10.30 గంటలకు పరిశీలించనుంది.
దాడి కలకలం
రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ అర్ణబ్ గోస్వామి దంపతులపై దాడి.. ముంబయిలో కలకలం రేపింది. వర్లీలోని తమ టీవీ స్టూడియో నుంచి ఇంటికి వెళుతుండగా.. రాత్రి 12.15 గంటలకు ఈ ఘటన జరిగిందని అర్ణబ్ చెబుతున్నారు. ఇద్దరు వ్యక్తులు తమ కారును అడ్డగించి ధ్వంసం చేస్తూ తీవ్రంగా దూషించారని ఆరోపించారు.
సోనియా పనే: అర్ణబ్
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీనే.. ఆమె అనుచరులతో తమపై దాడి చేయించినట్లు ఆరోపించారు అర్ణబ్. మహారాష్ట్ర పాల్ఘడ్లో దాడులు సహా మరికొన్ని వ్యవహారాల్లో సోనియాను ప్రశ్నించటం వల్లనే ఇలా తనపై దాడి చేసి ఉంటారని అర్ణబ్ తెలిపారు.
ఈ నేపథ్యంలోనే.. ఆయనపై దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో వందలాది ఎఫ్ఐఆర్లు నమోదైనట్లు సమాచారం.
ఖండించిన భాజపా
అర్ణబ్పై జరిగిన దాడిని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ ఖండించారు. ఈ దాడి ప్రజాస్వామ్య విరుద్ధమని వ్యాఖ్యానించారు. అలాగే భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా ముఖ్యనేతలు కూడా ఈ ఘటనను ఖండించారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా అర్ణబ్పై దాడిని తప్పుపట్టింది. మరో వైపు అర్ణబ్ దంపతులపై దాడి చేసిన కేసులో ఇద్దరు వ్యక్తులను పోలీసులు గురువారం అరెస్టు చేశారు.
ఇదీ చూడండి: 8 నెలల గర్భిణి.. అయినా విధులకు హాజరైన ఎస్ఐ