ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో జమ్ముకశ్మీర్కు సంబంధించి దాఖలైన వేర్వేరు వ్యాజ్యాలను రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగించింది సుప్రీంకోర్టు. ఆర్టికల్ 370 రద్దును సవాలు చేసిన పిటిషన్లతోపాటు ఈ వ్యాజ్యాలపై ఐదుగురు సభ్యుల ధర్మాసనం మంగళవారం నుంచి విచారణ జరుపుతుందని న్యాయస్థానం స్పష్టంచేసింది.
ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో సమాచార వ్యవస్థపై విధించిన ఆంక్షలు ఎత్తివేయాలన్న వ్యాజ్యం, కొందరు చిన్నారుల్ని అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్పై రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టనుందని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.
రాజ్యాంగ ధర్మాసనం...
జమ్ము కశ్మీర్ స్వయంప్రతిపత్తి రద్దుపై దాఖలైన వ్యాజ్యాలను విచారించేందుకు ఈనెల 28న జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సుభాష్ రెడ్డి, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ ఇందులో సభ్యులు.