Women T20 World Cup 2024 : టీ 20 వరల్డ్ కప్లో టీమ్ ఇండియా విజయం సాధించడంతో అభిమానుల సంబరాలు మిన్నంటాయి అన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అమ్మాయిల వంతు వచ్చింది. వారు ధనా ధన్ ఇన్నింగ్స్ ఆడేందుకు రంగం సిద్ధమైపోయింది.
మహిళల టీ 20 వరల్డ్ కప్ గురువారమే(అక్టోబర్ 3) గ్రాండ్గా ప్రారంభం కానుంది. అసలే గత కొంత కాలంగా మహిళల క్రికెట్ పంజుకుని, ఆకర్షణీయంగా మారింది. క్రికెట్ అభిమానుల దృష్టిని కూడా బాగానే ఆకర్షిస్తోంది. టీ 20ల్లో వారు ఆడే స్టేడియాలు కూడా నిండిపోతున్నాయి. టీవీ సెట్ల ముందు కూడా పర్వాలేదనిపించే సందడి కనిపిస్తోంది.
దీంతో యూఈఏ వేదికగా గురువారం ప్రారంభం కానున్న టీ20 పొట్టి కప్పుపై కూడా అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటి వరకు ఏ ఫార్మాట్లోనూ భారత మహిళల జట్టు ప్రపంచ కప్ సాధించలేకపోయింది. కానీ ఈ సారి ఎలాగైనా కప్ సాధించాలనే పట్టుదలతో ఉంది.
2020లో మొదటి సారి టీ 20 వరల్డ్ కప్ ఫైనల్ చేరింది భారత్. కానీ అనూహ్యంగా ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. తమ దేశ పురుషుల జట్టును కన్నా క్రికెట్లో ఆధిపత్యం చలాయిస్తున్న ఆసీస్ మహిళల జట్టు ఇప్పటివరకు ఆరు సార్లు విశ్వ విజేతగా నిలిచింది. అందుకే ఈ సారి కూడా ఆ జట్టు ఫేవరెట్గానే బరిలోకి దిగనుంది.
అయితే భారత జట్టు కూడా మునుపెన్నడూ లేనంత బలంగా, ఆల్రౌండ్ నైపుణ్యంతో బరిలోకి దిగుతోంది. కాబట్టి ఈ సారి మన అమ్మాయిలు కూడా కప్ గెలిచే అవకాశముందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇంకా ఇంగ్లాండ్, సౌతాఫ్రికా జట్లు కూడా టైటిల్ ఫేవరెట్గానే బరిలోకి దిగుతున్నాయి.
కాగా, ఇప్పటి వరకు 8 సార్లు మహిళల టీ20 వరల్డ్ కప్ జరిగింది. ఆస్ట్రేలియా ఆరుసార్లు 2010, 2012, 2014, 2018, 2020, 2023 విజయాన్ని అందుకుంది. ఇంగ్లాండ్ 2009లో, వెస్టిండీస్ 2016లో ఒక్కో టైటిల్ను ముద్దాడాయి.
ఈ సారి టోర్నీలో మొత్తం 10 జట్లు పోటీకి సై అంటున్నాయి. ఐదేసి జట్లు రెండు గ్రూప్లుగా విడిపోయి, మిగతా జట్లతో ఒక్కో మ్యాచ్లో తలపడతాయి. లీగ్ దశలో రెండు గ్రూప్ల నుంచి టాప్ రెండు జట్లు సెమీస్కు అర్హత సాధిస్తాయి.
ఈ సారి టీ20 ప్రపంచకప్నకు దుబాయ్, షార్జా మైదానాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ నెల 20న దుబాయ్లో ఫైనల్ పోరు జరగనుంది.
గ్రూప్-ఎలో భారత్, పాకిస్థాన్ ఉన్నాయి. ఈ రెండు జట్లు ఈ నెల 6న తలపడనున్నాయి.