దేశవ్యాప్తంగా లాక్డౌన్ను మరో 19 రోజులు పొడిగిస్తూ.. ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం రికార్డు వీక్షణలు సొంతం చేసుకుంది. ఏప్రిల్ 14న జాతినుద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ లైవ్ను దేశవ్యాప్తంగా 20 కోట్ల 30 లక్షల మంది టీవీల్లో వీక్షించారని బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రిసెర్చ్ కౌన్సిల్(బార్క్) వెల్లడించింది.
పదో వంతు మాత్రమే..
తొలిసారి లాక్డౌన్ ప్రసంగాన్ని 19కోట్ల 30 లక్షల మంది వీక్షించారు. ఈ ప్రసంగాన్ని 199 ప్రసార మాధ్యమాల్లో ప్రసారం చేయగా.. మొత్తం 400 కోట్ల నిముషాల పాటు ప్రజలు వీక్షించారు. ఇది కూడా ఒక రికార్డని బార్క్ ప్రధాన కార్యనిర్వహకుడు సునీల్లుల్లా తెలిపారు. అంతేకాకుండా 'ఆరోగ్య సేతు' యాప్ను రికార్డు స్థాయిలో డౌన్లోడ్ చేసుకున్నప్పటికీ.. వారిలో పదోవంతు మంది మాత్రమే ఉపయోగిస్తున్నారని మార్కెట్ పరిశోధన సంస్థ ఎసీ నీల్సన్ తెలిపింది.
38 శాతం పెరిగిన టీవీ వినియోగం
కరోనా ప్రభావం ముందు కంటే ఏప్రిల్ 12 తర్వాత టీవీల వినియోగం 38 శాతం పెరిగిందని బార్క్ వెల్లడించింది. ఇందులో జాతీయ బ్రాడ్కాస్టర్ దూరదర్శన్ తొలిస్థానంలో ఉందని లుల్లా వెల్లడించారు. రామాయణం, మహాభారతం వంటి క్లాసిక్ షోలను ప్రారంభించడం ద్వారా ప్రైవేట్ రంగ ఛానెళ్లను వెనక్కినెట్టిందని ఆయన తెలిపింది.
దేశంలో కరోనా కేసులు నమోదైనప్పటి నుంచి.. జనతా కర్ఫ్యూ, తొలిదశ లాక్డౌన్ ప్రకటన, వైద్యుల సేవలను ప్రశంసిస్తూ చప్పట్ల కొట్టడం, రెండోదశ లాక్డౌన్ ప్రకటనతో కలిపి నాలుగు సార్లు మోదీ జాతినుద్దేశించి మాట్లాడారు.