వ్యవసాయ చట్టాలపై ప్రధాని నరేంద్రమోదీకి పంజాబ్ రాష్ట్రం మరో అవకాశం ఇచ్చిందని కాంగ్రెస్ పేర్కొంది. కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నాలుగు బిల్లులను పంజాబ్ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించిన విషయాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ.. కేంద్రానికి సూచనలు చేశారు.
"రాజ్యాంగానికి విరుద్ధంగా సెప్టెంబర్లో వ్యవసాయ చట్టాలను భాజపా ప్రభుత్వం తీసుకొచ్చింది. పంజాబ్ ఇప్పుడు వారికి మరో అవకాశం ఇచ్చింది. ఇప్పటికైనా రైతుల బాధను అర్థం చేసుకుని సెప్టెంబరులో చారిత్రక తప్పిదాన్ని సరిదిద్దుకోవాలి. ఇందుకు పంజాబ్కు మోదీతోపాటు భాజపా కూడా కృతజ్ఞతలు తెలపాలి."
- అభిషేక్ సింఘ్వీ, కాంగ్రెస్ అధికార ప్రతినిధి
పంజాబ్ అసెంబ్లీ ఆమోదించిన బిల్లుపై ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి మన్ప్రీత్ బాదల్ స్పందించారు. రాజస్థాన్, ఛత్తీస్గఢ్, తెలంగాణ తదితర రాష్ట్రాలు బిల్లుల విషయంలో తమను సంప్రదించాయని తెలిపారు. వారి రాష్ట్రాల్లోనూ వీటిని అమలు చేసేందుకు బిల్లుల హార్డ్ కాపీలను ఇవ్వాలని కోరినట్లు స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: 'వ్యవసాయ' బిల్లులను ఆమోదించిన పంజాబ్ అసెంబ్లీ