దిల్లీ జగత్పురి ప్రాంతంలోని ఓ వ్యాపారి వదిలి వెళ్లిన మామిడి పండ్ల కోసం జనం ఎగబడ్డారు. చేతికి దొరికినన్ని పళ్లను దోచుకున్నారు.
ఏమైందంటే?
జగత్పురిలో పళ్లు అమ్మే వ్యాపారి ఆరిఫ్కు, కొందరు రిక్షా వాలాల మధ్య మధ్య వాగ్వాదం తలెత్తింది. ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోవాలని రిక్షావాలాలు ఆరిఫ్పై ఒత్తిడి తెచ్చారు. దీంతో కాసేపడికి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు చెప్పాడు ఆరిఫ్. వెళ్లిపోయే ముందు మామిడి పండ్ల డబ్బాలు అన్నీ తీసుకెళ్లలేకపోయినట్లు చెప్పుకొచ్చాడు.
ఇంకేముంది దారిలో వెళ్లే వారందరూ ఒక్కసారిగా ఎగబడ్డారు. అడ్డుకోవడానికి ఎవరూ లేకపోవడం వల్ల అందినకాడికి మామిడి పండ్లను దోచుకెళ్లారు. సంచులు, హెల్మెట్లలో నింపుకున్నారు. మరికొందరైతే చేతిలో పట్టినన్ని మామిడి పండ్లను తీసుకొని ఉడాయించారు.
లాక్డౌన్ కారణంగా ఇప్పటికే చాలా నష్టపోయామని, అది చాలదన్నట్లు రూ. 20 నుంచి రూ. 30 వేలు విలువైన మామిడి పండ్లు ఎత్తుకెళ్లినట్లు చెప్పాడు ఆరిఫ్ తమ్ముడు చోటు .
ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఆరిఫ్. ఇప్పటివరకు ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. కేసుపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.