కొన్నేళ్లపాటు పైసా పైసా కూడబెట్టి.. పాఠశాల నిర్మాణానికి విరాళమిచ్చింది డిగ్లో బాయి అనే వృద్ధురాలు. చిన్నతనంలో బడికే వెళ్లని ఆమె.. ఎదిగిన తర్వాత ఎంతోమంది అక్షరాలు నేర్చుకునేందుకు తోడ్పాటునందించింది. ఒంటరి జీవితాన్ని గడుపుతున్న డిగ్లో.. పాఠశాలకు వచ్చే చిన్నారుల్లోనే అన్ని బంధాలను చూసుకుంటోంది.
మధ్యప్రదేశ్ మండ్లా జిల్లాలోని పద్మి గ్రామానికి చెందిన డిగ్లో బాయిది నిరుపేద కుటుంబం. పేదరికం వల్ల ఆమె తల్లిదండ్రులు పాఠశాలకు పంపలేదు. ఈ క్రమంలో చదువు ఎంత విలువైందో తెలుసుకుంది డిగ్లో.
రూ. లక్ష విరాళం..
కూడబెట్టిన రూ. లక్ష నగదును తన గ్రామంలోని పాఠశాల గది నిర్మాణానికి విరాళంగా అందించింది. ఇందుకోసం తనకున్న కొద్దిపాటి భూమిని కూడా అమ్మింది డిగ్లో. రెక్కాడితేగాని డొక్కాడని ఆమె ఇంత మొత్తం పాఠశాల భవనానికి ఇవ్వడాన్ని గ్రామస్థులు అభినందిస్తున్నారు.
"1992లో గ్రామంలోని పాఠశాలను ప్రారంభించారు. అప్పుడు భవనం నిర్మాణం కోసం మొదట విరాళాలు సేకరించారు. ఆ సమయంలో డిగ్లో బాయి భర్త రూ.20 వేలు విరాళంగా ఇచ్చారు. అప్పుడు ఒక గదిని నిర్మించారు. తర్వాత గ్రామ ప్రజల మద్దతుతో రెండో గదిని పూర్తి చేశాం. ఇందుకోసం డిగ్లో బాయి రూ. లక్ష విరాళం అందించారు."
-మహసింగ్ ఠాకూర్, పాఠశాల ప్రిన్సిపల్
వారే సొంత పిల్లల్లా..
డిగ్లో బాయికి పిల్లలు లేరు. భర్త చనిపోయాడు. ఆమె ఇప్పుడు ఒంటరిగానే జీవిస్తోంది. అయితే ఆమె ఎప్పుడూ తను ఒంటరి అని భావించలేదు. అలా అనుకోలేదు కూడా. పాఠశాలలో చదువుతున్న పిల్లలందరినీ సొంత పిల్లల్లానే చూసుకుంటోంది. చిన్నారులు కూడా అమ్మమ్మ, నానమ్మ అని పిలుస్తుండటంలో ఎంతో అనుభూతి పొందుతోంది డిగ్లో.