ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఏడు కిలోమీటర్ల పాటు మెగా రోడ్షో నిర్వహించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రోడ్షోకు హాజరైన ప్రజలతో నగర వీధులు కిక్కిరిసిపోయాయి. ప్రధాని మోదీకి మద్దతుగా నినాదాలు హోరెత్తాయి. రోడ్షోలో భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సహా పార్టీ ముఖ్యనేతలు పాల్గొన్నారు. వారణాసి లోక్సభ స్థానానికి నామినేషన్ వేసే ఒక్కరోజు ముందే మోదీ ఇంత పెద్దస్థాయిలో రోడ్షో నిర్వహించడం ఆసక్తికరంగా మారింది.
ప్రజాబలం భాజపా వైపేనని చెప్పేందుకే..
2014 కంటే భాజపాకు, తనకు ప్రజాదరణ ఇప్పుడు మరింత పెరిగిందని చాటిచెప్పుకునేందుకే వారణాసిలో భారీస్థాయిలో ప్రధాని నరేంద్ర మోదీ రోడ్షో నిర్వహించారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వారణాసి స్థానం నుంచి దాదాపు మూడు లక్షల 70వేల ఓట్ల మెజార్టీతో గత ఎన్నికల్లో విజయం సాధించారు మోదీ.
ఈ ఐదేళ్లలో వారణాసి ప్రజల్లో మోదీ పట్ల వ్యతిరేకత తీవ్రంగా పెరిగిపోయిందని కాంగ్రెస్ నేతలు కొంతకాలంగా విమర్శిస్తున్నారు. ఆ నియోజకవర్గాన్ని ఆయన అసలు పట్టించుకోలేదని ఆరోపించారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వారణాసిపై ప్రత్యేక దృష్టి సారించారు.
కాంగ్రెస్ నేతల ఆరోపణలకు సమాధానమిచ్చేందుకే మోదీ ఇంత భారీ స్థాయిలో రోడ్షో నిర్వహించారు. తన గెలుపు ఈసారి కూడా నల్లేరుపై నడకేనని చెప్పే ప్రయత్నం చేశారు.
భాజపాలో ఉత్సాహం.. కాంగ్రెస్లో నిస్తేజం
వారణాసిలో ప్రధాని మోదీ రోడ్షో విజయవంతమవడం భాజపా శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. ఎవరు పోటీకి దిగినా భాజపా విజయం తథ్యమనే విశ్వాసాన్ని కలిగించింది.
వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ బరిలోకి దిగుతారనే ఊహాగానాలు చాలా కాలం నుంచి వినిపిస్తున్నాయి. మోదీపై పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రియాంక కూడా ప్రకటించారు. ఇక ఆ స్థానంలో హోరాహోరీ తప్పదని అందరూ భావించారు. మోదీకి గట్టిపోటీ తప్పదనుకున్నారు. అంచనాలను తలకిందులు చేస్తూ వారణాసి నుంచి మళ్లీ అజయ్రాయ్ పోటీ చేస్తారని కాంగ్రెస్ ప్రకటించింది. దీంతో అక్కడి కాంగ్రెస్ శ్రేణులు నిరుత్సాహపడ్డారు.
దేశ భద్రతపై మరోసారి
జాతీయవాదం, దేశ భద్రతపై మరోసారి వారణాసిలో ప్రసంగించారు ప్రధాని మోదీ. దేశం తమ పార్టీ ప్రభుత్వ హయాంలోనే భద్రంగా ఉంటుందని చెప్పే ప్రయత్నం చేశారు. తనకు దేశ ప్రయోజనాలే ప్రథమమని మోదీ అన్నారు. ఆ తర్వాతే మిగతా విషయాలని స్పష్టం చేశారు. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నామని తెలిపారు. సమర్థవంతమైన నాయకత్వంలోనే దేశరక్షణ పటిష్ఠంగా ఉంటుందన్నారు.
" గడిచిన ఐదేళ్లలో దేశంలోని ఏ పట్టణం, పవిత్ర స్థలాలు, ఆలయాలపై ఎలాంటి ఉగ్రదాడులు జరగలేదు. పుల్వామాలో 40 మంది జవాన్ల ప్రాణాలను ముష్కరులు బలిగొన్నారు. ఆ ఘటన తర్వాత అదే ప్రాంతంలో ఇప్పటి వరకు 42 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టాం. ఇదీ మా ప్రభుత్వ పనితీరు."
-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి"