దేశంలోని అనేక రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి రైతులు, వ్యవసాయ కూలీల ఆత్మహత్యలపై ఎలాంటి డేటా అందలేదని హోంమంత్రిత్వశాఖ పేర్కొంది. గత నాలుగేళ్లల్లో ఆత్మహత్య చేసుకున్న అన్నదాతల డేటాపై లోక్సభ వేదికగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ విషయాన్ని వెల్లడించారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్ రెడ్డి.
2016 నుంచి ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన అన్నదాతల ఆత్మహత్యలకు సంబంధించిన వివరాలు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) వద్ద ఉన్నాయా? లేవా? అని ప్రశ్నించారు వయనాడ్ ఎంపీ రాహుల్. 2015 నుంచి ప్రమాదవశాత్తు మరణించిన రైతుల వివరాలపై బ్యూరో ఎందుకు నివేదిక అందివ్వడం లేదని ఆరా తీశారు.
రాహుల్ ప్రశ్నలకు స్పందిస్తూ.. రైతుల ఆత్మహత్యలు, ప్రమాదవశాత్తు మరణాలపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి అందుతున్న వివరాలను 'ఆక్సిడెంటల్ డెత్స్ అండ్ సూసైడ్స్ ఇన్ ఇండియా'(ఏడీఎస్ఐ) అనే పేరుతో ఎన్సీఆర్బీ రిపోర్టు ప్రచురిస్తోందని గుర్తు చేశారు కిషన్రెడ్డి. ఈ నివేదికకు కావాల్సిన వివరాలను సకాలంలో అందివ్వాలని అన్ని ప్రాంతాలకు చెందిన ఎన్సీఆర్బీ విభాగాలను ఆదేశించామని స్పష్టం చేశారు.